గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మిన నలుగురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు నిర్మాణంలో ఉన్న వంతెన పైనుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా వడ్లకొండ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు కారులో తిరుపతికి బయలుదేరారు. దారి కోసం పూర్తిగా గూగుల్ మ్యాప్స్పైనే ఆధారపడ్డారు. రాత్రి సమయంలో వీరి వాహనం జనగామ జిల్లా వడ్లకొండ వద్దకు చేరుకోగా, గూగుల్ మ్యాప్ వీరిని నిర్మాణంలో ఉన్న ఓ వంతెన వైపునకు దారి చూపింది. రాత్రిపూట కావడంతో వంతెన అసంపూర్తిగా ఉందని యువకులు గమనించలేకపోయారు. వేగంగా కారును ముందుకు పోనివ్వడంతో అదుపుతప్పి వంతెన చివరి నుంచి నేరుగా కింద ఉన్న వాగులో పడిపోయింది.అయితే, అదృష్టవశాత్తు కారు కింద ఉన్న మట్టిదిబ్బపై పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కారులో చిక్కుకున్న యువకులను బయటకు తీసి చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, రాత్రి వేళల్లో కొత్త ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ను పూర్తిగా నమ్మవద్దని సూచించారు. నిర్మాణంలో ఉన్న రోడ్లు, వంతెనల సమాచారం యాప్లో అప్డేట్ కాకపోవచ్చని, అందువల్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa