ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు ఇక ఆ ఇబ్బంది ఉండదు.. టీటీడీ కీలక నిర్ణయం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 10:21 PM

తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి భక్తులు ఆధ్యా్త్మిక వాతావరణంలో శ్రీవారిని దర్శించుకుని.. సంతృప్తితో ఇళ్లకు తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి భక్తుల కోసం పలుచోట్ల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ పనులపై టీటీడీ ఈవో శ్యామలరావు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం నిర్మిస్తున్న భవనాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలని.. నిర్దేశించిన సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


మరోవైపు టీటీడీ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్లు అలసత్యం ప్రదర్శించకుండా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేసి నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవో సూచించారు. టిటిడిలో దళారి వ్యవస్థ, సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలను వేగంగా అందించేందుకు అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ విస్తరించాలని టీటీటీ ఈవో సూచించారు.


అలిపిరి చెకింగ్ పాయింట్ విస్తరణతో పాటుగా, కెమెరాల ఏర్పాటు, స్కానింగ్ యంత్రాలు, సెక్యూరిటీ అంశాలపై అంతర్జాతీయ విమానాశ్రయాలలో ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారో పరిశీలించి నివేదిక అందించాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. భక్తుల రద్దీ సమయంలో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరుతూ ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఈ ఆలోచన చేస్తోంది.


మరోవైపు శ్రీవారి భక్తులకు మరింత పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలతో కూడిన సేవలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇలాంటి సౌకర్యాలతో కళ్యాణ కట్ట నిర్మించాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టాలని టీటీడీ ఈవో సూచించింది ఆ తర్వాత దశలవారీగా విస్తరణ చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.


 అలాగే అన్నప్రసాదాల వంటసామాగ్రి కోసం మార్కెటింగ్ గోడౌన్‌లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ఆలయాల్లో టీటీడీ చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి అనుకున్న సమయానికి పూర్తి చేయాలని.. అలాగే ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాలపైనా ప్రత్యేక దృ,ష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa