అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్ సభ్యదేశంగా ఉన్న బ్రిక్స్ కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ కూటమిలోని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం అదనపు సుంకం విధిస్తామని గట్టిగా హెచ్చరించారు.సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "బ్రిక్స్ కూటమి మమ్మల్ని దెబ్బతీయడానికే ఏర్పడింది. మా డాలర్ విలువను తగ్గించేందుకు వారు పనిచేస్తున్నారు. అందుకే వారు కచ్చితంగా 10 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. డాలరే రాజు. దానిని అలాగే ఉంచుతాం. ఎవరైనా సవాలు చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ దాని కోసం వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది" అని ట్రంప్ హెచ్చరిక చేశారు.భారత్తో వాణిజ్య ఒప్పందం చర్చలు తుది దశలో ఉన్నప్పటికీ, బ్రిక్స్ సభ్యదేశంగా ఉన్నందున భారత్కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ తేల్చిచెప్పారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తాయని, ఈ గడువు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన ప్రకటించారు. అయితే, ఇతర దేశాలు సరైన ప్రతిపాదనలతో సంప్రదింపులకు వస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గడువుపై కట్టుబడి ఉన్నప్పటికీ చర్చలకు అవకాశం ఉందని పరోక్షంగా సూచించారు.బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు మొత్తం 11 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటా, ప్రపంచ జనాభాలో దాదాపు సగం ఈ దేశాల్లోనే ఉంది. గత అధ్యక్షులు సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే అమెరికా నష్టపోయిందని, తన హయాంలో ఆ పరిస్థితిని పునరావృతం కానివ్వనని ట్రంప్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa