ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఆ రూట్లోనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 08:52 PM

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌కు త్వరలోనే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. నరసాపురం - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. నరసాపురం - చెన్నై మార్గంలో త్వరలోనే వందే భారత్ రైలును ప్రారంభిస్తామని తెలిపారు. బుధవారం నరసాపురం రైల్వేస్టేషన్‌లో నరసాపురం - తిరువణ్ణామలై ప్రత్యేక రైలు సర్వీసును కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రారంభించారు. అనంతరం అదే రైలులో భీమవరం వరకూ ప్రయాణించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ఉభయ గోదావరి జిల్లా వాసులకు లబ్ధి చేకూరుతుందని శ్రీనివాసవర్మ తెలిపారు. అలాగే తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాబోయే రోజులలో వారానికి మూడు రోజులు నరసాపురం - అరుణాచలం ప్రత్యేక రైలు నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.


మరోవైపు ఏపీ మీదుగా ఇప్పటికే పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అందుబాటులో ఉంటోంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5:45 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 2:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. 699 కి.మీ. దూరాన్ని 8 గంటల 35 నిమిషాలలో చేరుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరితే.. అదే రోజు రాత్రి 11:35 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.


మరోవైపు సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య మరోన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. ఈ రైలు గురువారం తప్ప వారంలో మిగతా ఆరు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రబాద్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరితే.. అదే రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరితే.. రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.


  మరోవైపు విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కూడా నడుస్తోంది. బుధవారం తప్ప వారంలో మిగతా రోజులు ఈ విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో ఉంటుంది. 517 కి.మీ. దూరాన్ని 6 గంటల 40 నిమిషాలలో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరితే.. రాత్రి 10:00 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నై నుంచి ఉదయం 5:30 గంటలకు చెన్నై విజయవాడ వందే భారత్ రైలు బయల్దేరుతుంది. అదే రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.


వీటితో పాటుగా విశాఖపట్నం - భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, దుర్గ్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ - యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఏపీ మీదుగా నడుస్తున్నాయి. త్వరలోనే విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కించే ఆలోచనలో రైల్వే అధికారులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa