గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులను రాష్ట్ర జలవనరుల శాఖ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా బోర్డుల మార్గదర్శకాలపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడటంలోనూ జల వనరుల శాఖ ఇలాగే వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంలో గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుపై అనుసరిస్తున్న తీరునే ఇందుకు ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు.సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాల్సిన సమయంలో లేవనెత్తాల్సిన సందేహాలను ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమయంలో వ్యక్తం చేయడం వెనుక బోర్డుల్లోనూ, పీపీఏలోనూ తెలంగాణ ఇంజనీరింగ్ అధికారుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా జలాలపై హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీలు నిరంతరం నదీ యాజమాన్య బోర్డులపై ఒత్తిడి పెంచుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డుల విషయంలో ఉదాసీనతను, ప్రతిపక్ష పార్టీ వైసీపీ పూర్తి నిర్లక్ష్యాన్ని చూపుతున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రావాల్సిన న్యాయమైన హక్కులను కోల్పోవాల్సి వస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa