ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోన్న త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్ధిని మిస్సింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణ త్రిపురలోని సబ్రూమాకు చెందిన స్నేహా దేవ్నాథ్ (19) అనే యువతి జులై 7 అదృశ్యమైంది. దీంతో ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించగా.. ఆమె జాడ కోసం ఢిల్లీ పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ నేతృత్వంలో భారీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జూలై 7న ఉదయం తన తల్లికి స్నేహ ఫోన్ చేసింది. స్నేహితురాలు పిటునియాతో కలిసి తాను సరాయి రోహిల్లా రైల్వే స్టేషన్కు వెళ్తున్నానని చెప్పింది. ఆమె చిట్టచివరి కాల్ ఆరో ఉదయం 5:56కి నమోదు కాగా, 8:45 గంటల సమయంలో స్విచ్ఛాఫ్ అయ్యింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియరాలేదు.దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్నేహితురాలితో వెళ్తున్నానని చెప్పిందని తెలిపారు. ఈ క్రమంలో పిటునియాను పోలీసులు సంప్రదించగా.. ఆ రోజు ఉదయం స్నేహాను తాను కలవలేదని చెప్పింది. ప్రస్తుతం స్నేహ ఢిల్లీ యూనివర్సిటీ ఆత్మ రామ్ సనాతన్ ధర్మా కాలేజ్లలో చదువుతోంది.
స్నేహా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె బుక్చేసిన క్యాబ్ డ్రైవర్ స్నేహాను ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద దించానని చెప్పాడు. ఈ ప్రదేశం అత్యంత ప్రమాదకరమైందే కాక.. సీసీటీవీ ఫుటేజీ కూడా అస్పష్టంగా ఉండటంతో పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. ఇక, తమ రాష్ట్రానికి చెందిన యువతి అదృశ్యం కావడంతో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా స్పందించారు. ‘‘సబ్రూమ్కు చెందిన స్నేహా దేవ్నాథ్ ఢిల్లీలో అదృశ్యమైన ఘటనపై సీఎం మానిక్ షా తక్షణ చర్యలకు ఆదేశించారు’’ సీఎంఓ కార్యాలయం అధికారిక ప్రకటన వెలువరించింది. జులై 9 నుంచి సిగ్నేచర్ బ్రిడ్జ్ చుట్టుపక్కల 7 కిలోమీటర్ల పరిధిలో ఢిల్లీ పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. కానీ ఇప్పటివరకు ఏవైనా స్పష్టమైన ఆధారాలు దొరకలేదు.
ఆమె రాసినట్టు సూసైడ్ నోట్ ఒకటి ఉండగా.. స్నేహ అక్క మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఒక సూసైడ్ లెటర్ నాలుగు లైన్లలో ఉంటుందా? దాంట్లో ఆమె ఎందుకు డిప్రెషన్కు గురయ్యిందో, ఏం జరుగుతుందో ఎటువంటి సమాచారం లేదు. పైగా లెటర్లో సిగ్నేచర్ బ్రిడ్జ్ అని స్పష్టంగా రాసిఉంది... ఇది చాలా అనుమానాద్పంగా ఉంది’’ అన్నారు. అంతేకాదు, తన చెల్లి చాలా తెలివైనదే కానీ... ఏదో ఒకరు మోసం చేసి ఉండొచ్చు అని అనుమానించారు.
‘‘ఒకవేళ ఆత్మహత్యే చేసుకోవాలనుకుంటే, ఇంట్లోనే అనేక మార్గాలుంటాయి. మళ్లీ 60 కెమెరాలు పనిచేయని చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. ఇది ఏదైనా ప్లాన్ ప్రకారం జరిగిందా? అనేది అర్థం కావడం లేదు?’ అని ఆమె ప్రశ్నించారు.
కాగా, గత నాలుగు నెలలుగా స్నేహ బ్యాంక్ ఖాతాలో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. ఈ పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మార్చింది. అటు, స్నేహా ఆచూకీకి సంబంధించి సమాచారం కోరుతూ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఆమె ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. మిస్సింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. త్రిపురకు చెందిన స్నేహ కుటుంబం చాలా ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa