పంజాబ్ రాజకీయాలు సంచలన ఆరోపణలతో వేడెక్కాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా.. ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను 'టార్గెట్ కిల్లింగ్స్' కోసం ప్రధాని మోదీ ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బిష్ణోయ్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని, కేంద్ర హోంమంత్రి పరిధిలోని జైల్లోనే బిష్ణోయ్ ఉన్నాడని పేర్కొన్నారు. ఒక వ్యాపారవేత్త హత్యకు తానే బాధ్యుడినని జైలు నుంచే బిష్ణోయ్ ప్రకటన విడుదల చేశాడని చెప్పారు. అంటే అతడు జైలు నుంచి విడుదలైనట్టేనని వ్యాఖ్యానించారు. అలాగే పంజాబ్లో డ్రగ్ స్మగ్లర్లకు రక్షణ కల్పించేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా.. జులై 11వ తేదీన హర్పాల్ చీమా, ఆప్ పంజాబ్ అధ్యక్షుడు అమన్ అరోరాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఆప్ నాయకులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఒక వీడియోను ఎడిట్ చేశారని ఫిర్యాదులో ఆరోపంచారు. ఈ అబియోగాల ఆధారంగానే అదేరోజు పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు హర్పాల్ సింగ్ చీమా, అమర్ అరోరాలపై కేసులు నమోదు అయ్యాయి. ఐపీసీలోని సెక్షన్ 336(4), 356, 61(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దీనిపై స్పందిస్తూనే మంత్రి హర్పాల్ సింగ్ చీమా.. ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.
తమ సర్కారు మాజీ అకాళీ దళ్ మంత్రి బిక్రమ్ సింగ్ మజీథియాను జూన్ 25న అరెస్టు చేసినందుకు ప్రతీకారంగానే తమపై ఈ కేసులు పెట్టారని పేర్కొన్నారు. మజీథియాపైపై మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయని.. మజీథియా అరెస్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని మంత్రి చీమా వెల్లడించారు. తమపై, అరోరాపై వేగంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడమే దీనికి రుజువని పేర్కొన్నారు.
మజీథియా అరెస్టు తర్వాత కాంగ్రెస్ నాయకులు.. అతడిపై సానుభూతి చూపడంపై చీమా విమర్శలు గుప్పించారు. గతంలో మజీథియాను కాంగ్రెస్ నాయకులే తీవ్రంగా విమర్శించారని, ఇప్పుడు ఆయన అరెస్టు తర్వాత సానుభూతి చూపడం వారి ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోందని అన్నారు. మరోవైపు దీనిపై ప్రతాప్ సింగ్ బజ్వా స్పందించారు. ఆపే నేత హర్పాల్ చీమా అబద్ధాలు చెప్పడం, ఫోర్జరీలు చేయడం, తప్పుడు వీడియోలు తయారు చేయడంలో పీహెచ్డీ చేశారని అన్నారు. ఆయనతో పాటు మరో మంత్రిపై తాను చండీగఢ్ పోలీసుకు ఫిర్యాదు చేశారనని.. దీని ఆధారంగానే వారిపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. అలాగే వీరితో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ల పాత్రపైనా విచారణ జరుగుతోందని.. త్వరలోనే వీరిపై కూడా కేసులు నమోదు అవుతాయని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు పంజాబ్లో రాజకీయ ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో గ్యాంగ్స్టర్ల ప్రమేయంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు, ముఖ్యంగా ప్రధానిపై రాష్ట్ర మంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa