ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీజిల్ లోడుతో వెళ్తోన్న రైలుకు మంటలు.. తమిళనాడులో భారీ ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 09:09 PM

డీజిల్ లోడుతో వెళ్తోనన గూడ్సు రైలుకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన తమిళనాడులోని తిరువల్లూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చెన్నైలోని మనాలీ పోర్టు నుంచి బెంగళూరుకు ఇండియన్ ఆయిల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తం 52 వ్యాగన్లతో వెళ్తున్న రైలుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలు పట్టాలు తప్పడం వల్ల మంటలు చెలరేగాయి. మొదట ఐదు వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. మంటలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను కూడా తీసేశారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.


ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించామని రైల్వే పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై తిరువళ్లూర్ జిల్లా ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్ మాట్లాడుతూ. ‘‘రక్షణ బృందాలు పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణపాయం లేదు. పరిస్థితిని పూర్తిగా నియంత్రించాం’’ అని చెప్పారు.


అగ్నిమాపక శాఖ చీఫ్ సీమా అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ఇది డీజిల్ కావడంతో మంటలు అదుపు చేయడం చాలావరకు కష్టమైంది. అదనపు బృందాలను కూడా పంపించి మంటలను అదుపు చేశాం’’ అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా చెన్నై- అరక్కోణం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 8 రైళ్లు రద్దు చేశామని, మరో 5 రైళ్లు దారిమళ్లించామని దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి తీసుకురావడానికి విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తేలలేదు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా లోపభూయిష్ట ట్యాంకర్ వాల్వ్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa