ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఏటీఎంల్లో రూ.500 నోట్లు బంద్? ,,,ఆర్‌బీఐ ఆదేశాలపై కేంద్రం క్లారిటీ

business |  Suryaa Desk  | Published : Sun, Jul 13, 2025, 11:30 PM

ప్రస్తుతం చలామణిలో ఉన్న పెద్ద నోటు రూ. 500 ఒక్కటే. 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రూ. 1000, రూ. 500 రద్దు చేసి వాటి స్థానంలో రూ. 2000, రూ. 500 కొత్త నోట్లను తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. నల్లధనం అరికట్టేందుకంటూ ఈ చర్యలు చేపడుతున్నారు. ఇలా పెద్ద నోట్లకు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పుడు రూ.500 నోటుకు సంబంధించి ఏ చిన్న విషయమైనా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఈ నోటును సైతం రద్దు చేసి రూ. 200, రూ. 100 మాత్రమే చలామణిలో ఉంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏటీఎం కేంద్రాల్లో రూ. 500 నోట్లను ఆపేయాలను బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రూ. 500 నోటును సైతం రద్దు చేయడం, ఉపసంహరిస్తారేమోనని మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


అమాయక ప్రజల్ని మోసగించడమే లక్ష్యంగా ఇలాంటి దుష్ప్రచారాలకు తెరతీస్తున్నారు సైబర్ నేరగాళ్లు. నకిలీ సమాచారం వ్యాప్తి చేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతలను ఖాళీ చేస్తున్నారు. ఏటీఎంల ద్వారా రూ. 500 నోట్ల ఈ ఏడాది సెప్టెంబర్ 30, 2025 నాటికి నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశించినట్లు మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియాలో ఈ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీంతో రూ. 500 నోట్లను రూ. 200, రూ. 100గా మార్చుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది.


వాట్సాప్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. రూ. 500 నోట్లు చట్టబద్ధంగా చలామణిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. ఏదైనా వార్తను ఇతరులకు షేర్ చేసే ముందు అధికారికంగా ధ్రువీకరించుకోవాలని, ఆ తర్వాత ఇతరులకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. ఏటీఎంలు, బ్యాంకుల ద్వారా రూ. 500 నోట్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తేల్చి చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa