సిరియాపై వైమానిక దాడులకు దిగిన ఇజ్రాయెల్.. డమాస్కస్లోని అధికారిక టీవీ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ సందర్భంగా వార్తలు చదువుతోన్న ఓ యాంకర్ ప్రత్యక్ష ప్రసారం మధ్యలో భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్.. తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘సిరియాకు హెచ్చరికలు పూర్తయ్యాయి – ఇప్పుడు బాధాకరమైన దాడులు మొదలవుతాయి’’ అని హెచ్చరించారు. కాగా, గత నెలలో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం సమయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇరాన్ అధికారిక టీవీ ఆఫీసులో యాంకర్ వార్తలు చదువుతోన్న సమయంలో ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ పరిణామానికి ఆమె భయంతో వణికిపోయింది.
‘‘ఇజ్రాయెల్ రక్షణ దళాలు స్వైదాలో భీకర దాడులు కొనసాగిస్తాయి. ద్రూజ్ సముదాయాన్ని కాపాడాలని మేం ప్రతిజ్ఞ తీసుకున్నాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్లోని ద్రూజ్ ప్రజలకు మద్దతు తెలిపిన కాట్జ్.. ‘సిరియాలో మీరు ఒంటరి కాదు.. మీతో మేము ఉన్నాం’’ అని భరోసా ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ కూడా ఈ చర్యలకు పూర్తి మద్దతు ఇచ్చినట్టు రక్షణ మంత్రి పేర్కొన్నారు. గత నాలుగు రోజుల నుంచి సిరియాలో సాయుధ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు యూకే కేంద్రంగా పనిచేసే సిరియా హ్యూమన్ రైట్స్ అబ్జర్వర్ తెలిపింది. ఇజ్రాయెల్ బుధవారం రాత్రి నుంచి భీకర దాడులు మొదలుపెట్టింది. సిరియా సైనిక హెడ్క్వార్టర్స్పై దాడిచేసింది.
దక్షిణ సిరియాలోని స్వైదా ప్రావిన్సుల్లో మైనార్టీ వర్గం ద్రూజ్, సాయుధ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్రూజ్ సమాజాన్ని కోసం ఇజ్రాయెల్ నేరుగా జోక్యం చేసుకోవడాన్ని అంతర్జాతీయ విశ్లేషకులు అసాధారణమైన చర్యగా పేర్కొంటున్నారు. ద్రూజ్ సముదాయం పశ్చిమాసియాలో సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్లో విస్తరించి ఉంది. సిరియాలో అల్ బషర్ అసద్ శకం ముగిసి.. కొత్తపాలన మొదలవ్వడంత తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొంతమంది ఐక్యత కోరితే, మరికొందరు స్వయం పాలనకు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సిరియాలో సంక్షోభ కేంద్రాలుగా మారుతున్నాయి.
సిరియాలో రెండు దశాబ్దాలుగా కొనసాగిన అంతర్యుద్దం గతేడాది డిసెంబరులో ముగిసింది. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవికి రాజీనామా చేసి.. రష్యాకు ప్రవాసం పారిపోయారు. దీంతో సిరియా పాలన సున్నీ వర్గం ప్రభుత్వం సాగిస్తుండగా.. మైనారిటీ వర్గాలు, అసద్ అనుచరుల నుంచి నిరంతర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa