ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమిషానికి 700 రౌండ్లు ఫైర్.. ఆర్మీ అమ్ములపొదిలోకి అత్యాధునిక ఏకే-203 రైఫిల్

national |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 08:09 PM

సరిహద్దుల్లో ఓవైపు పాకిస్థాన్.. మరోవైపు చైనాల నుంచి ముప్పు పెరుగుతోన్న నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలో సైన్యం కోసం అత్యాధునిక ఏకే-203 రైఫిల్స్ సిద్ధమవుతున్నాయి. వీటిని రష్యా సహాయంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీలో తయారు చేస్తున్నారు. 2032 నాటికి ఇవ్వాల్సిన రైఫిల్స్‌ను 2030 నాటికే సైన్యానికి అందజేస్తామని ఇండో- రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటేడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్‌) తెలిపింది. నిమిషానికి 700 బుల్లెట్లను ఫైర్ చేయగలిగే ఈ రైఫిల్.. 800 మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా కచ్చితంగా చేధించగలదు. సరిహద్దుల్లో దాయాది తరుచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ, ఈ రైఫిల్స్ భారత సైన్యానికి మరింత బలాన్నిస్తాయి.. ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాల నుంచి ముప్పును దృష్టిలో ఉంచుకుని అధునాత ఆయుధాలను సమకూర్చుకుంలోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యధిక పరిధి కలిగిన టోవ్డ్ ఆర్టిలరీ గన్‌ను అభివృద్ధి చేసింది. .


  సరిహద్దుల్లోని పరిస్థితుల దృష్ట్యా భారతదేశం తన ఆయుధ శక్తిని పెంచుకుంటోంది. కలాష్నికోవ్ సిరీస్‌లో కొత్తగా ఏకే-203 రైఫిల్స్‌ను సైన్యానికి అందిస్తున్నారు. చాలా శక్తివంతమైన ఈ రైఫిల్స్‌ను ‘షేర్’ పేరుతో అమేథీలోని ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేస్తోంది ‘మేము 2030 నాటికే 6.01 లక్షల ఏకే-203 రైఫిల్స్‌ను భద్రతా దళాలకు అందిస్తాం’అని IRRPL సీఈఓ మేజర్ జనరల్ ఎస్.కె.శర్మ అన్నారు. వాస్తవానికి ఈ రైఫిల్స్‌ను 2032 అక్టోబరు నాటికి ఇవ్వాల్సి ఉండగా.. కానీ అంతకంటే ముందే అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కాంట్రాక్ట్ విలువ దాదాపు రూ.5,200 కోట్లు. అగ్ని-5 కొత్త వేరియంట్‌, 7500 కిలోల బంకర్ బస్టర్ వార్‌హెడ్‌లను భారత్ సమకూర్చుకుంటోంది.


ఇప్పటికే 48 వేల రైఫిల్స్‌ను అందజేశామని తెలిపారు. రెండు మూడు వారాల్లో మరో 7 వేల రైఫిల్స్, డిసెంబర్ నాటికి అదనంగా 15 వేల రైఫిల్స్ అందజేస్తామని ఆయన అన్నారు. ఏకే-47, ఏకే-57 కంటే ఈ 'షేర్' రైఫిల్స్ అత్యాధునికమైనవి. ఇవి కలాష్నికోవ్ సిరీస్‌లో చాలా ప్రమాదకరమైనవి కూడా. మన సైన్యం ప్రస్తుతం ఇన్సాస్ రైఫిల్స్‌ను వాడుతోంది. వాటి స్థానంలో ఈ ఏకే-203 రైఫిల్స్‌ను వాడనున్నారు. ఇన్సాస్ రైఫిల్ కాలిబర్ 5.62 ఎంఎం. కానీ ఏకే-203 రైఫిల్ కాలిబర్ 7.62 ఎంఎం.ఈ తుపాకీ బరువు 3.8 కేజీలు కాగా.. ఇన్సాస్ బరువు 4.15 కిలోలు. ఇన్సాస్‌ (960ఎంఎం)తో పోల్చితే పొడవు ( 705 ఎంఎం) కూడా తక్కువే. కాగా, రెండు రోజుల కిందట ఆకాశ్ ప్రైమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను లడఖ్‌లో పరీక్షించింది.


సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు ఈ రైఫిల్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనివల్ల మన సైన్యం మరింత బలంగా తయారవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. నియంత్రణ రేఖ , వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ కాసే సైనికులకు ఇవి చాలా అవసరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa