కులం ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధమని మద్రాస్ హైకోర్టు చారిత్రక తీర్పును ఇచ్చింది. చట్టబద్ధమైన పాలన కలిగిన దేశంలో కుల ఆధారిత వివక్షను ఏమాత్రం అనుమతించలేమని స్పష్టం చేసింది. సమాజంలోని ఏ వర్గాన్ని అయినా ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సమానత్వ సూత్రాన్ని ధ్రువీకరిస్తూ.. పుదుకుడు అయ్యనార్ ఆలయంలోకి షెడ్యూల్డ్ కుల వ్యక్తుల ప్రవేశం నిరాకరించకుండా చూసుకోవాలని అరియలూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకు సూచించింది.
తమిళనాడు అరియలూరు జిల్లా ఉదయార్పాలయం తాలూకాలోని పుదుకుడి అయ్యనార్ ఆలయంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వారికి ప్రవేశం నిరాకరించడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి హిందువు, వారి కులం లేదా తెగతో సంబంధం లేకుండా, ఏ ఆలయంలోనైనా ప్రవేశించడానికి అర్హులని కోర్టు పునరుద్ఘాటించింది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులానికి చెందిన ఎ వెంకటేషన్ అనే వ్యక్తి.. పుదుకుడి అయ్యనార్ ఆలయంలోకి తమ వర్గానికి చెందిన వారి అనుమతించడం లేదంటూ.. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పెద్ద ఇనుప గేటు వెనుక నుంచి మాత్రమే దేవుడిని దర్శించుకోవాలని బలవంతం చేస్తున్నట్లు ఆరోపిస్తూ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాల వారు ఏర్పాటు చేసిన విగ్రహాలను, రాతి నిర్మాణాలను ఆధిపత్య కులాలకు చెందిన వారు ధ్వంసం చేశారని వివరించారు. ముఖ్యంగా ఒక పెద్ద అయ్యనార్ విగ్రహాన్ని బావిలో పడేశారని కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వివక్షాపూరిత చర్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు నివేదించారు. ఈ అంశంపై స్పందించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్.. "కులం, సమాజం మానవుల సృష్టి, దేవుడు ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటాయి" అని వ్యాఖ్యానించారు. కులం ఆధారంగా వ్యక్తులను ప్రార్థనలు చేయకుండా నిరోధించడం వారి గౌరవానికి భంగం కలిగించడమేనని ఆయన అన్నారు. ఇది చట్టబద్ధమైన పాలన కలిగిన దేశంలో ఎప్పటికీ అనుమతించబడదని స్పష్టం చేశారు.
1947 నాటి తమిళనాడు ఆలయ ప్రవేశ అధికార చట్టంలోని సెక్షన్ 3ని ఉటంకిస్తూ.. ప్రతి హిందువుకు కులం లేదా తెగతో సంబంధం లేకుండా ఏ హిందూ ఆలయంలోనైనా ప్రవేశించి పూజలు చేసే హక్కును కల్పిస్తుందని కోర్టు గుర్తు చేశారు. ఈ తీర్పుతో.. అరియలూరు జిల్లా ఎస్పీ మరియు ఆర్డిఓలకు అన్ని వర్గాల హిందువులను ఆలయంలోకి ప్రవేశించడానికి మరియు జూలై 16 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఆలయ ఉత్సవంలో పాల్గొనడానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా వారిని అడ్డుకుంటే.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa