ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది మమ్మల్ని కాదు కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి..: నిమిష ప్రియ కేసుపై సుప్రీం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 08:18 PM

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే శుక్రవారం రోజు సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగానే నిమిష తరఫు బృందం.. బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము మెయెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మస్థానాన్ని కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. ఇందుకు తమను అనుమతి అడగాల్సిన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలని సూచించింది. ముఖ్యంగా కేసు విచారణను సుప్రీం ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.


కేరళకు చెందిన నిమిష ప్రియ 2017లో తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్డో మహ్దీని హత్య చేసిన కేసులో దోషిగా తేలింది. ఈ కేసులో ఆమెకు 2020లో మరణశిక్ష పడగా.. 2023 నవంబర్‌లో యెమెన్ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును సమర్థించింది. నిమిష ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని జైలులో ఉంది. ఈ ప్రాంతం హూతీ మిలీషియా నియంత్రణలో ఉండటం వల్ల అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇది ఆమెను కాపాడే ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారింది.


నిమిష ప్రియ తరపు న్యాయవాదులు, 'సేవ్ నిమిషా ప్రియ – ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్' అనే స్వచ్ఛంద సంస్థ ఆమెను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. షరియా చట్టం ప్రకారం.. బాధితుడి కుటుంబానికి 'బ్లడ్ మనీ' (దియా) చెల్లించడం ద్వారా మరణశిక్ష నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈక్రమంలోనే నిమిష తల్లి ప్రేమ కుమారి, ఒక సామాజిక కార్యకర్త ప్రస్తుతం యెమెన్‌లో మహ్దీ కుటుంబంతో బ్లడ్ మనీ గురించి చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రయత్నాలకు ప్రభుత్వ నిధులే కాకుండా స్వతంత్రంగా కూడా నిధులు సేకరిస్తున్నారు.


భారత ప్రభుత్వం మొదటి నుంచీ ఈ కేసులో అన్ని విధాలా సహాయం అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తాజాగా జరిగిన విచారణలో భాగంగా సుప్రీం కోర్టుకు తెలిపింది. న్యాయ సహాయం అందించడం, న్యాయవాదిని నియమించడం, క్రమం తప్పకుండా కాన్సులర్ సందర్శనలను ఏర్పాటు చేయడం వంటివి ఇందులో ఉన్నాయని వివరించింది. యెమెన్ అధికారులతో, నిమిష కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా MEA ప్రతినిధి తెలిపారు. ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని స్థానిక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోరుతూ.. ప్రభావవంతమైన షేక్‌లతో కూడా కేంద్రం సంప్రదింపులు జరిపినట్లు అటార్నీ జనరల్ ఆర్. వెంకట రమణి సుప్రీం కోర్టుకు తెలియజేశారు.


ఈ సందర్భంగానే నిమిష ప్రియ తరఫున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యెమెన్ వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతం ఈ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం సర్కారు వద్ద అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. ఆనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.


అసలేం జరిగిందంటే..?


మహ్దీ తన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, తనను వేధించాడని నిమిష ప్రియ ఆరోపించింది. పాస్‌పోర్ట్‌ను తిరిగి పొందేందుకు ఆమె మహ్దీకి మత్తు మందు ఇచ్చిందని.. అయితే అది అధిక మోతాదు కావడంతో అతను మరణించాడని కోర్టు పత్రాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఆమె ఒక స్థానిక మహిళ సహాయంతో మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్‌లో పడేసింది. ఈ కేసులో బాధితుడి కుటుంబం ఉరిశిక్ష అమలుపై దృఢంగా ఉన్నారు. నిమిషను క్షమించే అవకాశమే లేదని.. కచ్చితంగా ఆమెకు శిక్ష పడాల్సిందేనని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa