మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల కుమార్తె తరచుగా ఫోన్ చూస్తోందని.. విపరీతమైన కోపం పెంచుకున్నాడా సవతి తండ్రి. దాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయిన అతడు చిన్న పిల్లని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మరీ.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ ముంబైలోని సాసూన్ డాక్ సమీపంలో సముద్రంలో తేలియాడుతున్న ఒక చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే కోలాబా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని నీళ్లలోంచి బయటకు తీసుకు వచ్చారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈక్రమంలోనే నగరంలోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా చిన్నారి అదృశ్యం కేసు నమోదు అయిందేమో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే అంతోప్ హిల్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఇమ్రాన్ షేక్, అతడి భార్య నాజియా తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు గుర్తించి వారికి సమాచారం అందించారు. ఇలా వారు ఆసుపత్రికి చేరుకుని చిన్నారి చూసి.. తమ కుమార్తెనేనని చెప్పారు. గుండెలవిసేలా రోదిస్తూనే కనిపించారు. కానీ బాలిక ఎలా కనిపించకుండా పోయిందని అడగ్గా.. ఇమ్రాన్ షేక్ సరైన సమాధానం ఇవ్వలేదు. అలాగే తల్లి చివరగా తన కుమార్తెను భర్త వద్ద ఉంచి బయటకు వెళ్లినట్లు చెప్పగా.. పోలీసులు ఇమ్రాన్ పై అనుమానం మొదలైంది.
ముఖ్యంగా ఆయన బాలికకు.. సవతి తండ్రి అని తెలియగా ఆ అనుమానం మరింత ఎక్కువైంది. దీంతో ఆయన కదలికలపై ఓ కన్నేసి.. మరోవైపు బాలిక మృతదేహం లభ్యం అయిన చోట సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అతడే చిన్నారిని సముద్రంలో పడేసినట్లు గుర్తించారు. ఇలా ఇమ్రాన్ షేక్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. తరచుగా చిన్నారి ఫోన్ చూస్తూ.. అర్ధరాత్రుళ్లు 2, 3 వరకు పడుకోవడం లేదని చెప్పాడు. నిత్యం అదే పనిగా ఫోన్తో ఆటలాడుతూ.. తనను భార్యతో కలిసి ఉండనివ్వకుండా, పడుకోనివ్వకుండా ఇబ్బంది పెడుతోందని వివరించాడు. అది భరించలేకే అర్ధరాత్రి తన సవతి కుమార్తె గొంతు నులిమి హత్య చేశానని.. ఆపై మృతదేహాన్ని గోనె సంచిలో వేసి అరేబియా సముద్రంలో పడేసినట్లు వెల్లడించాడు.
దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలు, ఇతర ప్రమేయాలు ఏమైనా ఉన్నాయా అనే కూపీ లాగుతున్నారు. ఈ దారుణ ఘటన ముంబై నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa