ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో కలిసి అడ్డంగా దొరికేసిన మహిళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 19, 2025, 06:23 PM

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. ఈ మాట, ఈ హెడ్డింగ్ తెలుగు రాష్ట్రాలలో ఇటీవల సర్వసాధారణమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో నిత్యం ఏదో ఒకచోట, ఏదో ఒక మూల.. భర్త చేతిలో భార్య, లేదా భార్య చేతిలో భర్త బలైపోతున్నాడు. వివాహేతర సంబంధాలు, ఇతరత్రా కారణాలతో నిండు నూరేళ్లు కలిసి నడవాల్సిన వారు.. తమ భాగస్వామ్యులను కాటికి పంపుతున్న పరిస్థితి. అయితే ఇలాంటిదే అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఇందులో ట్విస్ట్ మాత్రం.. వేరే లెవెల్. భర్తతో అభిప్రాయ భేదాలు రావటంతో అతనికి దూరంగా ఉంటున్న ఓ మహిళ.. మరో వ్యక్తికి దగ్గరైంది. ఈ ప్రియుడి సాయంతో మరో వ్యక్తి హత్యకు ప్లాన్ చేసింది. అయితే ఊహించని రీతిలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు అదే ప్రియుడితో కలిసి ఊచలు లెక్కపెడుతోంది.


అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలంలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళ, ఆమె ప్రియుడితో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాయవరం మండలానికి చెందిన ఓ మహిళకు పెళ్లైంది. భర్తతో విభేదాలు రావటంతో దూరంగా ఉంటోంది. ఈ విషయంలో ఆమెకు అండగా నిలిచాడో విలేకరి. పోలీస్ స్టేషన్, కేసుల విషయంలో మహిళకు మద్దతుగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే మహిళతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతో ఆమె వద్ద నుంచి విలేకరి డబ్బులు, బంగారం అప్పుగా తీసుకున్నారు. ఇదే సమయంలో మరో వ్యక్తి సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో ఆమెకు సన్నిహిత సంబంధం ఏర్పడింది.


ఆ తర్వాత విలేకరికి అప్పుగా ఇచ్చిన బంగారం, డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ మహిళ ఒత్తిడి తీసుకురావటం మొదలెట్టింది. దీంతో ప్రియుడితో మహిళ యవ్వారం తెలిసిన విలేకరి.. ఈ విషయాన్ని అటు మహిళ భర్త కుటుంబానికి, ఇటు ఆమె ప్రియుడు కుటుంబానికి చేరవేశాడు. దీంతో విలేకరి మీద కోపం పెంచుకున్న మహిళ, ఆమె ప్రియుడు.. అతణ్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు వ్యక్తులకు సుపారీ ఇచ్చారు. ఇక సుపారీ గ్యాంగ్ వెంటనే రంగంలోకి దిగింది. పక్కాగా ప్లాన్ చేసుకుంది. జూలై 11వ రాత్రి దాడి చేయాలని ప్రణాళిక రచించారు. అనుకున్న విధంగానే అడ్డరోడ్డు శ్రీనివాస కళ్యాణ మండపం వద్ద ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా కొట్టారు.


అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. సుపారీ గ్యాంగ్.. ఒకరికి బదులుగా మరొకరి మీద దాడి చేయటం.. ఓ విలేఖరిపై దాడి చేసేందుకు సుపారీ తీసుకున్న గ్యాంగ్.. అడ్రస్ తెలియక పొరబాటున వాచ్‌మెన్ మీద దాడి చేసింది. వాచ్‌మెన్ అరుపులు విన్న భార్యాపిల్లలు గట్టిగా కేకలు వేయడంతో సుపారీ గ్యాంగ్ అక్కడి నుంచి ఉడాయించింది. దాడి విషయంపై వాచ్‌మెన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విషయం అంతటితో ఆగిపోలేదు. వాచ్‌మెన్ భార్యాపిల్లలకు కేకలు వేయటంతో పారిపోయిన సుపారీ గ్యాంగ్.. విలేకరిని చంపేశామంటూ మహిళకు ఫోన్ చేసి చెప్పారు. ఆవిడ క్లారిటీ కోసం విలేకరికి ఫోన్ చేయగా.. అతను బతికే ఉన్నట్లు తెలిసింది. దీంతో హత్య చేస్తేనే కానీ డబ్బులు ఇవ్వమంటూ మహిళ, ఆమె ప్రియుడు సుపారీ గ్యాంగ్‌‍కు తేల్చిచెప్పారు. దీంతో సుపారీ గ్యాంగ్ ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయ్యిందని.. మరోసారి దాడి చేసేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.


ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లుగా పోలీసుల విచారణలో.. మహిళ, ఆమె ప్రియుడి వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో మహిళ, ఆమె ప్రియుడితో పాటుగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.దాడిలో గాయపడిన వాచ్‌మెన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa