ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ .. ఆ తర్వాత తానే స్వయంగా పార్టీ స్థాపించి.. త్వరలో జరగబోయే బిహార్ ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. జన్ సూరజ్ పార్టీ స్థాపించి.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. జనాల మధ్యలో నడుస్తుండగా.. గుర్తు తెలియని వాహనం వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్కు ప్రమాదం జరిగింది. శుక్రవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ప్రశాంత్ కిషోర్ శుక్రవారం ఆరా సిటీలో జరిగిన సభకు హాజరయ్యారు. అనంతరం ఆయన ప్రజలతో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఒకటి వచ్చి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ కిషోర్ పక్కటెముకలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం తప్పడంతో పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 2024 అక్టోబర్ 2న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 243 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ తొలి సమావేశాన్ని పాట్నాలో నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులను నాలుగు నుండి ఐదు రౌండ్లలో ప్రకటిస్తామని తెలిపారు. మొదట 40 రిజర్వ్డ్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ పార్టీ బిహార్ ఎన్నికల రంగంలోకి దిగడంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. జేడీయూ, బీజేపీ కూటమి, మహాఘట్బంధన్ పార్టీలతో జన్ సూరజ్ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యూహకర్తగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్.. వాస్తవంగా రాజకీయాల్లో ఏమేరకు రాణిస్తారో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa