భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. మరోసారి అద్భుత పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) ఫలితాల్ని జులై 19న విడుదల చేసింది. ఇక 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు ఏకంగా రూ. 18,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సరిగ్గా కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే నికర లాభం 12 శాతం పెరిగింది. అప్పుడు లాభం రూ. 16,175 కోట్లుగా ఉంది. ఈ అద్భుతమైన ఫలితాలతో పాటు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక తన చరిత్రలోనే తొలిసారిగా షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్ షేర్లు ఇష్యూ చేయడంతో పాటు.. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ఈ దిగ్గజ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం సమీక్షా త్రైమాసికంలో రూ. 31,440 కోట్లకు పెరిగింది. మొత్తం బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ. 39,54,100 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.40 శాతంగా నమోదయ్యాయి. బ్యాంక్ తన బ్రాంచ్ నెట్వర్క్ను 9,499కు పెంచుకోగా.. ఇదే సమయంలో ఏటీఎంల సంఖ్యను 21,251కు విస్తరించింది. ఇక మొత్తం వడ్డీ ఆదాయం రూ. 77,470 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ. 73,033 కోట్లుగా ఉండగా.. అక్కడి నుంచి 6 శాతం పెరిగింది.
బోనస్ షేర్లు..
ఫలితాల సమయంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంకు బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ బ్యాంకు చరిత్రలో బోనస్ షేర్లు ఇష్యూ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. 1:1 రేషియోలో బోనస్ షేర్లను ప్రకటించగా.. ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుకు ఉచితంగా అదనంగా మరో ఈక్విటీ షేరు లభిస్తుందన్నమాట. దీనికి రికార్డు తేదీ ఆగస్ట్ 27గా ప్రకటించింది. అంటే ఆలోగా ఈ బ్యాంక్ షేర్లను కలిగి ఉండాలన్నమాట. ఈ లెక్కన 100 షేర్లు ఉన్నవారికి మరో 100 షేర్లు ఫ్రీగా లభిస్తాయి. అయితే దీనికి తగ్గట్లుగా షేర్ ధర అడ్జస్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ జులై 25గా ఉంది. ఈ డివిడెండ్ను ఆగస్టు 11న అర్హులైన సభ్యులకు చెల్లిస్తారు.
బ్యాంక్ సగటు డిపాజిట్లు జూన్ 2025 త్రైమాసికానికి రూ. 26,57,600 కోట్లుగా నమోదయ్యాయి. జూన్ 2024 త్రైమాసికంలో ఇది రూ. 22,83,100 కోట్లుగా ఉంది, ఇది 16.4% వృద్ధిని సూచిస్తుంది. మార్చి 2025 త్రైమాసికంలో ఇది రూ. 25,28,000 కోట్లుగా ఉంది, దీనితో పోలిస్తే 5.1 శాతం వృద్ధి నమోదైంది. నెట్వర్క్ విషయానికి వస్తే.. జూన్ 30తో ముగిసిన త్రైమాసికం నాటికి బ్యాంక్ నెట్వర్క్ 4,153 నగరాలు/పట్టణాలలో.. మొత్తం 9,499 బ్రాంచ్లుగా ఉంది. ఇంకా 21,251 ఏటీఎంలను కలిగి ఉంది. ఇక ఏడాది వ్యవధిలో కొత్తగా 72 నగరాలకు తన సేవల్ని విస్తరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa