ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ బోధన,,,ఏపీలో వినూత్న కార్యక్రమం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 05:33 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలనావ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు చదువులో వెనుకబడిన విద్యార్థుల విషయంలోనూ ఏఐ వాడకంపై ఫోకస్ పెట్టింది. దోమల నియంత్రణకు కూడా ఏఐ వినియోగించాలని ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించాలని ఆలోచనలు చేస్తోంది. చదువులో వెనుకబడిన పిల్లలకు డిజిటల్‌ విధానంలో బోధించే విధానాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్ని్ంగ్  విధానంలో భాగంగా డిజిటల్ విద్యాబోధన ద్వారా విద్యార్థులు ఇష్టపడే విధానంలోనే పాఠాలు అర్థమయ్యేలా చెప్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.


ఇంగ్లీష్, గణితం, తెలుగు సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులకు డిజిటల్‌ విధానంలో చదువు చెప్పనున్నారు. ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనిమిది పాఠశాలలను ఇందుకోసం ఎంపిక చేశారు. గతేడాది రెడ్డిగూడెం, గంపలగూడెం, ఎ.కొండూరుకేజీబీవీల్లో ఈ విధానం అమలు చేశారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్ని్ంగ్ విధానంలో భాగంగా ఎంపిక చేసిన ఒక్కొక్క పాఠశాలకు ట్యాబ్‌లు అందజేశారు. అలాగే పవర్‌ ఛార్జింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు కోసం స్కూళ్లకు రూ.22,500 చొప్పున నిధులు కేటాయించారు.


మరోవైపు విద్యార్థుల సబ్జెక్టులలోని పాఠ్యాంశాలను తొలుత ఈ ట్యాబ్‌ల్లో నిక్షిప్తం చేస్తారు. డేటా అనాలిసిస్, ఏఐ ద్వారా ఈ ట్యాబ్‌లు పనిచేస్తాయి. స్కూళ్లల్లోని పవర్ ఛార్జింగ్ ల్యాబ్‌లోకి వెళ్లి ట్యాబ్‌ ఓపెన్ చేయగానే వీడియోలో పాఠం వస్తుంది. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు వస్తాయి. పాఠం విని, ఆ తర్వాత వచ్చే ప్రశ్నలలో ఎన్నింటికి సరైన సమాధానాలు చెప్తారో తెలుసుకుని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అలాగే తప్పులను కూడా తెలియజేస్తుంది.


విద్యార్థులు చెప్పే జవాబుల ఆధారంగా తర్వాతి పాఠాలు వస్తాయని అధికారులు చెప్తున్నారు. మొత్తంగా విద్యార్థులకు ఇష్టమైన పద్ధతిలోనే పాఠాలు బోధించి మెరుగైన ఫలితాలు సాధించాలనేది ప్రభుత్వం ఆలోచన.పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ప్రారంభించి.. వచ్చే ఫలితాల ఆధారంగా మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa