కేరళ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నేత వీఎస్ అచ్యుతానందన్ సోమవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 101 ఏళ్లు కాగా.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 23న గుండెపోటుకు గురికావడంతో చికిత్స కోసం ఆయనను కుటుంబసభ్యులు తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. వైద్యుల చికిత్స చేస్తున్నా.. రోజు రోజుకూ ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఏడుగురు వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షించింది. అయితే, చివరకు పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం అచ్యుతానందన్ తుదిశ్వాస విడిచారు. వీఎస్ అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకూ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఇక, దశాబ్దాల పాటు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన వెళ్లప్పల్లి సత్యనాథన్ అచ్యుతానందన్ కమ్యూనిస్టు ఉద్యమానికి జీవితం అంకితం చేసిన నేతగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాట యోధునిగా గుర్తింపు పొందారు. 1923లో అలప్పూజ జిల్లా పునప్రాలోని ఒక సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్, బాల్యంలో కార్మిక హక్కుల కోసం పోరాడే కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు. ట్రావెన్కోర్ దివాన్.. అమెరికన్ మోడల్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలకు వ్యతిరేకంగా జరిగిన పునప్రా-వేలయార్ ఉద్యమానికి అచ్యుతానందన్ నాయకత్వం వహించారు. 'కేరళ అక్టోబర్ విప్లవం'గా గుర్తింపు పొందిన ఈ ఉద్యమంలో అచ్యుతానందన్ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
దీంతో ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు.. కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన అచ్యుతానందన్ జీవితాన్ని మలుపు తిప్పింది. 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జాతీయ కౌన్సిల్ నుంచి నిష్క్రమించారు. అనంతరం కొత్తగా ఏర్పడిన మార్క్సిస్టు పార్టీ CPI(M)కు సహ-వ్యవస్థాపకుడిగా వ్యవహరించారు. అసమానంగా సాగిన ఆయన రాజకీయ జీవితంలో పార్టీ కార్యదర్శిగా, విపక్ష నేతగా, అనంతరం కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. అచ్యుతానందన్ మృతిపై రాజకీయ నేతలు, ప్రముఖలు సంతాపం తెలియజేస్తున్నారు. ‘అచ్యుతానందన్ కేవలం రాజకీయ నేతే కాదు, ప్రజాస్వామ్యం పట్ల అపార నిబద్ధత కలిగిన మార్గదర్శకుడు’ అని కొనియాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa