కర్నూలు జిల్లా భారత రక్షణ రంగంలో కీలక కేంద్రంగా రూపొందుతోంది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కర్నూలును ఆయుధ పరీక్షల కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో తయారైన ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లు, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (UAVs), డ్రోన్ల పరీక్షలు ఇకపై ఇక్కడే జరగనున్నాయి. ఈ దిశగా ముందడుగుగా, DRDO కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ పరీక్షా కేంద్రంలో ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3ని విజయవంతంగా పరీక్షించింది.
ఈ పరీక్షలో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా ప్రయోగించిన V3 మిస్సైల్ ఘన విజయం సాధించింది. ఈ క్షిపణి శత్రు దుర్భేద్య ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు, దీనిని ‘ఆత్మ నిర్భర్ భారత్’కు నిదర్శనంగా అభివర్ణించారు. ఈ విజయం దేశీయ రక్షణ పరిశ్రమలకు ఊతమిస్తూ, సంక్లిష్ట రక్షణ సాంకేతికతను అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు.
ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ V3ని మొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 10-14 మధ్య బెంగళూరు యలహంకలో జరిగిన ఏరో ఇండియా 2025లో ప్రదర్శించారు. ఈ ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైల్ 12.5 కిలోల బరువు కలిగి, 4 కిలోమీటర్ల పరిధిలో పగలు, 2.5 కిలోమీటర్ల పరిధిలో రాత్రి లక్ష్యాలను ఛేదించగలదు. ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కెమెరాతో, రాత్రి చీకటిలోనూ లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలదు. ఇది స్థిర మరియు కదిలే లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదిస్తుంది.
రాజ్నాథ్ సింగ్ ఈ విజయం సాధించిన DRDO, రక్షణ పరికరాల తయారీ సంస్థలు, MSMEలు, స్టార్టప్లకు అభినందనలు తెలిపారు. ఈ మిస్సైల్లో డ్యూయల్-థ్రస్ట్ సాలిడ్ ప్రొపల్షన్ యూనిట్ మరియు 2-వే డేటా లింక్ సౌకర్యం ఉన్నాయి. ప్రస్తుతం రక్షణ శాఖలో మూడు రకాల ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లు అందుబాటులో ఉన్నాయి, దీనితో భారత రక్షణ శక్తి మరింత బలపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa