కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా కొనసాగుతోంది. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ, ఈ కేసు దర్యాప్తుకు కొంత సమయం పట్టవచ్చని తెలిపారు. సెల్ టవర్ డేటా ఆధారంగా 350 మంది అనుమానితుల మొబైల్ సిగ్నల్స్ గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఆ రోజు సమీప గ్రామంలో జరిగిన జాతర కారణంగా రెండు సెల్ టవర్ల సిగ్నల్స్ ఒకే ప్రాంతంలో కనిపించడంతో విచారణలో జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం 60 మంది అనుమానితులను విచారించాల్సి ఉందని, దర్యాప్తు వేగవంతం చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. గండికోట ప్రాంతంలో మైనర్ పిల్లలకు గదులు ఇవ్వరాదని కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని, వాటిని తోసిపుచ్చకుండా విచారణ జరుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోవడం వల్ల దర్యాప్తు కొంత ఆలస్యమవుతోందని డీఐజీ వివరించారు. అయినప్పటికీ, వీలైనంత త్వరగా కేసును చేధించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై కూడా దృష్టి సారించి విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
పోలీసులకు ఎలాంటి దివ్య శక్తులూ లేవని, మానవ శక్తిపై ఆధారపడి దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ప్రస్తుతం వివరాలను వెల్లడించలేమని ఆయన అన్నారు. ప్రజల సహకారంతో ఈ హత్య కేసును త్వరలోనే ఛేదించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa