ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షాద్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం,,,లారీ కింద ఇరుక్కున్న బీటెక్ స్టూడెంట్

Crime |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 09:13 PM

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ చౌరస్తాలో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ ట్యాంకర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ టైర్ల కింద ఇరుక్కొని మృత్యువతో పోరాడుతూ.. ఆ అమ్మాయి చేసిన ఆర్తనాదాలు అక్కడి వారిచే కంటతడి పెట్టించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్ శంషాబాద్‌లోని వర్ధమాన్ కళాశాలలో బీటెక్ చదువుతోన్న తన కూతురు మైత్రిని కళాశాలకు పంపేందుకు స్కూటీపై బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్ చౌరస్తా వద్దకు రాగానే.. వేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్ లారీ వారి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో మచ్చేందర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మైత్రి లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతూ.. 'అంకుల్ నన్ను కాపాడండి ప్లీజ్' అంటూ ఆమె చేసిన ఆర్తనాదాలు, ఆ దృశ్యాన్ని చూసిన వారిని తీవ్రంగా కలచివేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే, మైత్రి అతి కష్టమ్మీద తన మొబైల్‌ను సమీపంలో ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి, కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని ప్రాథేయపడింది. ఆమె చివరి నిమిషంలో చేసిన ఈ ప్రయత్నం అక్కడి వారి కళ్ళల్లో నీళ్లు నింపింది. అదే సమయంలో.. స్నేహితురాలి నుంచి మైత్రికి ఫోన్లు రావడంతో, స్థానికులు ప్రమాదం విషయాన్ని చెప్పి, ఆమె బంధువులకు సమాచారం అందించారు.


అయితే మైత్రి ఆర్తనాదాలు చేస్తూనే.. రక్తం ఎక్కువగా పోటవంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన షాద్‌నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఇలా దుర్మరణం పాలు కావడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఇక ఇవాళ ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి సమీపంలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పార్పియో వాహనం లారీని ఢీకొట్టిన ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు ప్రాణాలు కోల్పోయారు. కారులోనే ప్రయాణిస్తున్న ఏఎస్పీ, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa