ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఎంతుంది,,,, కేంద్రం కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Mon, Jul 28, 2025, 11:47 PM

స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల అంశంపై మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంటులో మరోసారి ఈ అంశంపై ప్రశ్నలు తలెత్తాయి. 2024లో భారతీయుల స్విస్ బ్యాంక్ డిపాజిట్లు మూడు రెట్లు పెరిగి దాదాపు రూ.37,600 కోట్లకు చేరినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో భారతీయుల డిపాజిట్లు ఆ స్థాయికి చేరుకున్నాయా? ఇందులో నల్లధనం కూడా ఉందా? 2022 నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి నల్లధనం ఎంత తిరిగి వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


స్విస్ నేషనల్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2024లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ద్వారా స్విట్జర్లాండ్ ప్రతి సంవత్సరం భారతీయులకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని అందిస్తోందని వెల్లడించింది. బ్లాక్ మనీ యాక్ట్  2015 ప్రకారం ఒకసారి ఇచ్చిన వెసులుబాటు ద్వారా రూ.4,164 కోట్ల విలువైన నల్లధనాన్ని వెల్లడించగా, దానిపై పన్ను, జరిమానా కింద రూ.2,476 కోట్లు వసూలు చేసినట్లు ప్రభుత్వం గణాంకాలు వెల్లడించింది.


స్విస్ నేషనల్ బ్యాంక్ గణాంకాల ఆధారంగా కొన్ని మీడియా నివేదికలు వచ్చాయని, వాటిలో 2024లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు జావేద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. స్విస్ వివరాల ప్రకారం.. ఎస్ఎన్‌బీ గణాంకాలలో కస్టమర్ డిపాజిట్లు, ఇతర బాధ్యతలు, బ్యాంకుల నుంచి రావాల్సిన మొత్తాలు కూడా ఉన్నాయని మంత్రి వివరించారు. స్విస్ నేషనల్ బ్యాంక్ వార్షిక గణాంకాలను భారతీయులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న డిపాజిట్లను విశ్లేషించడానికి ఉపయోగించకూడదని స్విస్ అధికారులు స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు. ఈ మొత్తం నల్లధనంగా భావించడం సరికాదని పేర్కొన్నారు. 2018 నుంచి ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ద్వారా స్విట్జర్లాండ్ ప్రతి సంవత్సరం భారతీయుల ఆర్థిక సమాచారాన్ని భారత్‌కు అందిస్తోందన్నారు.


మొదటిసారి ఈ డేటాను 2019, సెప్టెంబర్‌లో భారతదేశానికి అందించిందని, ఈ ప్రక్రియ ప్రతి సంవత్సరం కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విదేశీ ఆదాయం, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని 100 కంటే ఎక్కువ విదేశీ పన్ను పరిధి ప్రాంతాల నుంచి భారత్ పొందుతోందని, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే, ఆదాయపు పన్ను శాఖ విచారణ, తనిఖీ, అసెస్‌మెంట్, పన్ను, జరిమానా వసూలు, అవసరమైతే క్రిమినల్ ప్రాసిక్యూషన్ వంటి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.


2022 నుంచి 2025 వరకు విదేశాల నుంచి ఎంత నల్లధనం తిరిగి వచ్చింది అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. బ్లాక్ మనీ యాక్ట్ , 2015 అమలు చేసిన తర్వాత 2015లో 3 నెలల పాటు ఇచ్చిన వెసులుబాటు ద్వారా రూ.4,164 కోట్ల విలువైన నల్లధనాన్ని వెల్లడించారని, దానిపై పన్ను, జరిమానా కింద రూ.2,476 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. మార్చి 31, 2025 నాటికి నల్లధన చట్టం కింద 1,021 అసెస్‌మెంట్లు పూర్తయ్యాయన్నారు. వీటిలో పన్ను, జరిమానా కింద రూ.35,105 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో మొత్తం 163 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేశారని, పన్ను కింద రూ.338 కోట్లు ఇప్పటికే వసూలు చేసినట్లు తెలిపారు.


పన్ను డిమాండ్‌కు సంబంధించిన అన్ని అప్పీళ్లు హైకోర్టులు, సుప్రీంకోర్టులో పరిష్కారమైన తర్వాత మాత్రమే తుది నిర్ణయం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. స్విస్ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం అంటే నల్లధనం అని కాదని అర్థం చేసుకోవడం ముఖ్యమని తెలిపింది. డబ్బును ప్రకటించి, అవసరమైన పన్ను చెల్లించినట్లయితే, ఎవరైనా స్విట్జర్లాండ్‌లో ఖాతా తెరవడం చట్టవిరుద్ధం కాదని గుర్తు చేసింది. స్విస్ నేషనల్ బ్యాంక్ ప్రచురించే డేటాను భారతీయుల చట్టవిరుద్ధ డిపాజిట్లకు ప్రత్యక్ష ఆధారంగా పరిగణించలేమని ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa