వర్షాకాలంలో జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలకు చాలామంది పారాసిటమాల్ టాబ్లెట్లను ఆశ్రయిస్తారు. ఇది తక్షణ ఉపశమనం ఇస్తుంది కాబట్టి, చాలామంది దీన్ని అతిగా వాడుతుంటారు. అయితే, తాజా అధ్యయనాల ప్రకారం, పారాసిటమాల్ను అధికంగా లేదా దీర్ఘకాలం వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని తేలింది. ఈ మందు సాధారణంగా సురక్షితమైనదిగా పరిగణించినప్పటికీ, అతిగా వాడితే శరీరంలో అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ప్రకారం, పారాసిటమాల్ అతిగా వాడటం వల్ల జీర్ణాశయ పుండ్ల రక్తస్రావం ముప్పు 24%, పేగుల సమస్యలు 36%, కిడ్నీ వ్యాధులు 19%, గుండె వైఫల్యం 9%, రక్తపోటు 7% పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఈ మందును దీర్ఘకాలం వాడితే ఈ ప్రమాదాలు మరింత తీవ్రమవుతాయి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ మందును వాడేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. చిన్నపాటి లక్షణాలకు వెంటనే టాబ్లెట్లు మింగడం కంటే, ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ చికిత్సలు పాటించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న చిన్న జ్వరం, నొప్పుల కోసం పారాసిటమాల్పై ఆధారపడే బదులు ఇంటి చిట్కాలను అనుసరించడం మంచిది. తేనె, అల్లం, తులసి టీ, విశ్రాంతి వంటి సహజ మార్గాలు శరీరానికి హాని కలిగించకుండా ఉపశమనం అందిస్తాయి. ఒకవేళ మందులు తీసుకోవాల్సి వస్తే, వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. పారాసిటమాల్ను అతిగా వాడటం వల్ల కలిగే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారించడానికి అవగాహన, జాగ్రత్తలు చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa