ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి కంపించిన క్షణాలు: చరిత్రలో అత్యంత శక్తివంతమైన 10 భూకంపాలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 30, 2025, 11:24 PM

రష్యా తీరంలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని వణికించిన 10 అతి బలమైన భారీ భూకంపాలను చూద్దాం.
1. బయోబియో, చిలీ:1960లో చిలీ మధ్య ప్రాంతంలో సంభవించిన 9.5 తీవ్రతతో కూడిన భూకంపం ప్రపంచంలోనే అత్యంత భారీ భూకంపంగా నమోదైంది. 'వాల్దివియా భూకంపం' లేదా 'గ్రేట్ చిలీ భూకంపం'గా ప్రసిద్ధి చెందిన ఈ విపత్తు తదనంతరం సంభవించిన భారీ సునామీల కారణంగా చిలీలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ 1,655 మంది ప్రాణాలను బలిగొంది. వేలాది మంది గాయపడ్డారు. మొత్తంగా 20 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.
2. అలాస్కా: 1964లో అలాస్కాలోని ప్రిన్స్ విలియం సౌండ్‌ను 9.2 తీవ్రతతో కూడిన భూకంపం దాదాపు 5 నిమిషాల పాటు వణికించింది. అమెరికా చరిత్రలో నమోదైన అతిపెద్ద భూకంపం ఇదే. అయితే దీని ధాటికి వచ్చిన సునామీ కారణంగా 130 మందికి పైగా మరణించారు. భారీ కొండచరియలు విరిగిపడటం, ఎత్తైన అలలు తీవ్రమైన వరదలకు కారణం అయ్యాయి. ఈ భూకంపం తర్వాత వారాల తరబడి వేలాది కంపనాలు సంభవించాయి.
3. సుమత్రా, ఇండోనేషియా: 2004లో ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతంలో సంభవించిన 9.1 తీవ్రతతో కూడిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ.. ఆగ్నేయాసియా, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికాను నాశనం చేశాయి, 2, 80,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఇండోనేషియాలోనే 167,000 మందికి పైగా మరణించారు. అనేక గ్రామాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. ఫలితంగా 1.1 మిలియన్ల మంది నిరాశ్రయులు అయ్యారు.
4. తోహోకు, జపాన్ : 2011లో ఈశాన్య జపాన్ తీరంలో 9.1 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. దీని వల్ల భారీ సునామీ కూడా నమోదు అయింది. ఇది ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్‌ను ధ్వంసం చేసి.. విద్యుత్ సరఫరా, కూలింగ్ వ్యవస్థలను నిలిపివేసింది. అలాగే మూడు రియాక్టర్లలో మెల్ట్‌డౌన్‌కు కారణమైంది. ఈ భూకంపం సునామీల్లో 15,000 మందికి పైగా మరణించారు. వారిలో కొందరి మృతదేహాలు ఇప్పటికీ లభించలేదు. లక్షా 30 వేల మంది దీని వల్ల నిరాశ్రయులు అయ్యారు.
5. కమ్‌చట్కా, రష్యా: 1952లో 9.0 తీవ్రతతో కూడిన భూకంపం కమ్చాట్కాలో గణనీయమైన నష్టాన్ని కలిగించింది. సునామీ సైతం వచ్చింది. అయినా అదృష్టవశాత్తు ఒక్క మరణం కూడా సంభవించలేదు. కానీ 1 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం చోటు చేసుకుంది.
6. బయోబియో, చిలీ: 2010లో మధ్య చిలీని 8.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం తాకింది. రాజధానిని ఒకటిన్నర నిమిషం పాటు వణికించి, సునామీకి దారితీసింది. ఈ విపత్తులో 523 మంది మరణించారు. మొత్తంగా 3.7 లక్షల ఇళ్లు ధ్సంసం అయ్యాయి.
7. ఎస్మెరాల్డాస్, ఈక్వెడార్: 1906లో సంభవించిన 8.8 తీవ్రతతో కూడిన భూకంపం ఫలితంగా వచ్చిన సునామీ.. దాదాపు 1,500 మంది ప్రాణాలను తీసింది.
8. అలాస్కా:1965లో అలాస్కాలోని రాట్ దీవులను 8.7 తీవ్రతతో కూడిన భూకంపం తాకింది. దీని ఫలితంగా 11 మీటర్ల (35 అడుగుల) ఎత్తైన సునామీ వచ్చింది. భవనాలలో పగుళ్లు, తారు రన్‌వేలో పగుళ్లు వంటి సాపేక్షంగా చిన్నపాటి నష్టం సంభవించింది.
9. అరుణాచల్ ప్రదేశ్:1950లో 8.6 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించినప్పుడు కనీసం 780 మంది మరణించారు. డజన్ల కొద్దీ గ్రామాలు ధ్వంసం అయ్యాయి.సుబన్సిరి నదిని భారతదేశంలో అడ్డుకున్న భారీ కొండచరియలు కూడా సంభవించాయి. అయితే దీన్ని అస్సాం-టిబెట్ భూకంపంగా కూడా పిలుస్తుంటారు.
10. సుమత్రా, ఇండోనేషియా : 2012లో ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా పశ్చిమ తీరంలో 8.6 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం పెద్దగా నష్టాన్ని కలిగించనప్పటికీ, ఇది 2004లో సంభవించిన విధ్వంసకర సునామీకి మూలమైన ఒక ఫాల్ట్‌పై ఒత్తిడిని పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa