ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ రెండో తేదీన అన్నదాత సుఖీభవ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రకాశం జిల్లా పర్యటనలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నారు. తొలివిడత సాయం కింద కేంద్రం అందించే రెండు వేలతో కలిపి మొత్తం రూ.7000 రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం ఏటా అందించే రూ.6000లకు మరో రూ.14000 కలిపి రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.20000 అందించనున్నారు.
అయితే అన్నదాత సుఖీభవ పథకంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. అది అన్నదాత సుఖీభవ కాదు.. అన్నదాత దుఖీఃభవ అంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20000 ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు.
"చంద్రబాబు గారు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు..అన్నదాత దుఃఖీభవ. సూపర్ సిక్స్ హామీల అర్హులు అందరికి కాదు..కొందరికే. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే.. కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులనే. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సగం మందికే ఇస్తూ, తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు కోత పెట్టి, ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు."
మరోవైపు అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20 వేలు ఇస్తుందని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పారన్న వైఎస్ షర్మిల.. తీరా గెలిచాక కేంద్రం ఇచ్చే రూ.6000తో ముడిపెట్టి నాలుక మడతేశారని విమర్శించారు. " కేంద్రం ఇచ్చే రూ.6000 పక్కన పెడితే రాష్ట్ర నిధుల నుంచి మీరిచ్చేది కేవలం రైతుకి రూ.14వేలే. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారు. కేంద్రం నేరుగా రైతుల అకౌంట్లో వేస్తున్నప్పుడు మీరెలా ఇచ్చినట్లు చెప్పుకుంటారు అన్నారు? రెండు కలిసే సమస్యే లేదన్నారు. ఇన్ని మాటలు చెప్పి ఇప్పుడు మీరెందుకు కేంద్రం నిధులతో లింక్ పెట్టారు ? మీరిస్తామని చెప్పిన రూ.20 వేలకు కేంద్రం వాటాను ఎందుకు జోడించారు ?" అంటూ షర్మిల ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేముందు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదంటూ వైఎస్ షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకం దేశంలో ఉన్న రైతులందరికి తప్పా కేవలం ఏపీకే కాదు కదా అని నిలదీశారు. సీఎం చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలని.. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుకు రూ.20వేలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అయితే వైఎస్ షర్మిల డిమాండ్ చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.20000 ఇచ్చి.. దానికి కేంద్రం వాటా కూడా తోడైతే అర్హులైన రైతులకు ఏటా రూ.26000 అందే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa