వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయం వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు గడువు ఆగస్ట్ 1 (నేటితో) ముగియనుంది. ఇక పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకుని సొంత ఇలాఖాలో వైఎస్ జగన్కు షాకివ్వాలని టీడీపీ కూటమి భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న కూటమి.. అభ్యర్థిని కూడా స్ట్రాటజికల్గా బరిలోకి దింపింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి ని బరిలోకి దింపారు. ఈ మేరకు.. శుక్రవారం మారెడ్డి లతారెడ్డి టీడీపీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు.
పులివెందుల జడ్పీటీసీగా ఉన్న మహేశ్వరరెడ్డి ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్టలోనూ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జూలై 30వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ దాఖలుకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. ఆగస్ట్ 2న నామినేషన్ల పరిశీలన, ఆగస్ట్ 5వ తేదీ వరకూ నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంది. ఆగస్ట్ 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఆగస్ట్ 14వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతూ ఉండటం.. కూటమి పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో కడప రాజకీయం వేడెక్కింది. దీనికి తోడు కడప జిల్లాలో పాగా వేయాలనే ఉద్దేశంతో టీడీపీ ఉంది. ఇందులో భాగంగానే ఇటీవలే కడప వేదికగా మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది.
సాధారణంగా పదవిలో ఉండగా ఓ వ్యక్తి చనిపోయి ఉప ఎన్నిక వస్తే.. ఆ స్థానంలో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు బరిలోకి దిగితే.. వేరే పార్టీలు పోటీకి దూరంగా ఉండే సంప్రదాయం ఉండేది. కానీ ఈసారి సంప్రదాయాన్ని పక్కనబెట్టి టీడీపీ తన అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డిని బరిలోకి దింపింది. అటు వైసీపీ అభ్యర్థిగా మహేశ్వర్ రెడ్డి కుమారుడు హేమంత్ కుమార్ పోటీ చేస్తున్నారు. దీంతో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa