ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఎస్సీ, ఎస్టీ యువతకు.. రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:36 PM

నిరుద్యోగ యువత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తుంటాయి. నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా.. వారికి శిక్షణ అందించడంతో పాటుగా.. వారు తమ సొంత కాళ్లపై నిలబడేలా రుణ సదుపాయం వంటి సౌకర్యాలు, పథకాలు కల్పిస్తుంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) తీసుకువచ్చింది. ఈ పథకం కింద కొత్త ఆలోచనలతో వ్యాపారం లేదా స్వయం ఉపాధి పొందాలనుకుని ముందుకు వచ్చే యువతకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ పథకం అమలు చేస్తున్నారు. అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన యువతకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయనున్నారు. తాజాగా ఈ మార్పులు చేశారు.


ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద తయారీ రంగంలో పరిశ్రమలకు గరిష్ఠంగా రూ.50 లక్షల వరకూ రుణాలు అందిస్తున్నారు. అలాగే సర్వీస్ సెక్టార్‌లోని పరిశ్రమలకు రూ. 20 లక్షల వరకూ రుణం అందిస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే యువతకు యూనిట్ వ్యయంలో 35 శాతం వరకూ రాయితీ అందిస్తారు. ఇక పట్టణ ప్రాంతాలలో అయితే 25 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం లబ్ధి పొందేందుకు 18 ఏళ్లు పైబడిన వారు అర్హులు. గరిష్ట వయోపరిమితి అంటూ విధించలేదు. అయితే సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే యువతకను దృష్టిలో పెట్టుకుని 18 ఏళ్లుగా అర్హత వయసు నిర్ణయించారు.


అయితే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని గతేడాది వరకూ ఎస్సీ, ఎస్టీలతో పాటుగా బీసీలు, మైనారిటీ సామాజికవర్గాలు, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు కూడా వర్తింపజేశారు. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రుణాలు మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.


ఈ నేపథ్యంలో డెయిరీఫామ్‌లు, పంటల సాగు, గొర్రెల పెంపకం, టిష్యూ పేపర్ల తయారీ వంటి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే నజరానాలు, రాయితీతో కూడిన రుణాల సాయంతో సొంతంగా యూనిట్లు నెలకొల్పవచ్చని అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa