ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని కల్లుగీత కార్మికులకు భారీ గుడ్ న్యూస్..సెప్టెంబర్ 1 నుంచి నూతన బార్ పాలసీ అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 08:19 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు గుడ్ న్యూస్ వినిపించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతన బార్‌ పాలసీ అమలు చేయనున్నారు, ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మంత్రి వర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా నూతన బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆల్కహాల్‌ తక్కువ ఉన్న మద్యం అమ్మకాల ద్వారా మద్యం వలన కలిగే నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని సూచించారు. ఇక నూతన బార్ పాలసీ ప్రకారం.. బార్ల కేటాయింపులోనూ కల్లుగీత వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే అమలు చేస్తున్న ఏపీ లిక్కర్ పాలసీలోనూ కల్లుగీత వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.


మరోవైపు ప్రస్తుతం ఉన్న బార్ పాలసీని పూర్తి స్థాయిలో మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమలు చేయనున్న నేపథ్యంలో బార్ పాలసీ రూపకల్పనతో అధికారులు కసరత్తు చేస్తు్న్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని బార్లు ఏర్పాటు చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనలు సడలించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పర్యాటక ప్రాంతాలలో కొత్త బార్లు ఏర్పాటును ప్రోత్సహించేలా నిబంధనలు సడలించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం ఉన్న బార్లను ఒకచోట నుంచి మరో చోటకు మార్చుకునే వెసలుబాటును కల్పించనున్నట్లు తెలిసింది.


ఈ నెల 31వ తేదీతో ప్రస్తుతం ఉన్న ఏపీ బార్ పాలసీ ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ ఒకటి నుంచి నూతన బార్ పాలసీని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఎక్సైజ్ పాలసీపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బార్ పాలసీ రూపకల్పనలోనూ పనిచేస్తోంది. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం 840 బార్లు ఉన్నాయి. అలాగే స్టార్ హోటల్స్, మైక్రోబ్రూవరీలలో మరో 50 బార్లు పనిచేస్తున్నాయి. అలాగే ప్రస్తుత పాలసీ పీరియడ్‌లో 44 బార్లు తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోలేదు. వీటన్నింటిని మీద ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. తాజాగా కల్లుగీత కార్మికులకు బార్లలో పదిశాతం కోటా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో 840 బార్లలో 84 బార్లు ఆ సామాజిక వర్గాలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మరికొన్ని కొత్త బార్లు ఏర్పాటు చేస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa