జమ్మూకశ్మీర్కు ప్రత్యేక స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నిర్ణయం దేశ ఐక్యత, సమానత్వాన్ని బలోపేతం చేసే దిశగా వేసిన ఒక చారిత్రాత్మక ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు.2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చట్టం రద్దుతో జమ్మూకశ్మీర్ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్, లడఖ్ విభజించారు. ఈ ఆరో వార్షికోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని పెంపొందించిందని, జాతీయ సమగ్రతను మరింత బలపరిచిందని పేర్కొన్నారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్లో పాలన, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయన నొక్కి చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2019 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సుమారు 5,600 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, మరో 66,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామాలు కశ్మీర్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని అన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు రాజ్యసభలో 125-61, లోక్సభలో 370-70 ఓట్ల తేడాతో భారీ మెజారిటీతో ఆమోదం లభించింది. ఈ నిర్ణయం దేశ సమైక్యతను, రాజ్యాంగ సమగ్రతను కాపాడటానికి తీసుకున్న సాహసోపేతమైన చర్యగా పవన్ కల్యాణ్ వంటి నేతలు అభివర్ణిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa