ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై మరో 25 శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్

national |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:21 PM

భారత్-రష్యా స్నేహాన్ని, వాణిజ్యాన్ని దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఆగస్ట్ 1వ తేదీన ప్రపంచ దేశాలపై విధించే టారిఫ్‌ల శాతాన్ని వెల్లడించిన ట్రంప్.. భారత్‌పై 25 శాతం పన్నులు విధించనున్నట్లు వెల్లడించారు. అయితే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్‌పై టారిఫ్ బాంబ్ వేశారు. అయినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోవడంతో ట్రంప్ మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బాంబ్ పేల్చారు. భారత్‌పై మరోసారి 25 శాతం పన్నులను విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 25 శాతం టారిఫ్‌లతో సతమతం అవుతున్న భారత్‌కు.. తాజా 25 శాతం టారిఫ్‌లు మోయలేని భారంగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు వేసినట్లయింది.


భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలకు సంబంధించి.. డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ విడుదల చేశారు. అయితే మొదట విధించిన 25 శాతం టారిఫ్‌లు ఆగస్ట్ 6వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా.. ప్రస్తుతం విధించిన టారిఫ్‌లు.. ఉత్తర్వులు విడుదలైన 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అంటే తాజా 25 శాతం టారిఫ్‌లు ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమలు జరగనున్నాయి. అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ వస్తువులు ఇప్పటికే నౌకల్లో లోడ్ అయిన వాటికి ఈ అదనపు సుంకాలు వర్తించవని స్పష్టం చేశారు. అదే విధంగా సెప్టెంబర్ 17వ తేదీకి ముందు దిగుమతి చేసుకునే వస్తువులపైనా తాజా 25 శాతం టారిఫ్‌లు అమల్లో ఉండవని వెల్లడించారు.


ఇప్పుడు విధించిన టారిఫ్‌లకు భారత్ మళ్లీ ప్రతీకార సుంకాలు వేయాలని ప్రయత్నిస్తే.. వీటిని మరింత పెంచవచ్చని వైట్‌హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌పై అమెరికా మొత్తంగా 50 శాతం సుంకాలు విధించడంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.


అయితే ఈ సుంకాల పెంపు గురించి ముందుగానే ట్రంప్ భారత్‌ను హెచ్చరించారు. భారత్‌ అత్యధిక సుంకాలు విధించే దేశం అని.. ఏ దేశంపైన అయినా భారత్ సుంకాలు అధికంగానే విధిస్తుందని పేర్కొన్నారు. అందుకే భారత్‌తో అమెరికాకు తక్కువ వాణిజ్యం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకాలు విధించామని.. 24 గంటల్లో భారీగా పెంచుతామని నిన్న తీవ్ర హెచ్చరికలు చేశారు. రష్యా నుంచి చమురును కొనడం ద్వారా.. ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు మద్దతుగా నిలుస్తోందని.. దాని పట్ల తాను సంతోషంగా లేనని ట్రంప్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే 25 శాతం అదనపు సుంకాలు విధించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa