ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ నేతలు మద్యం సొమ్ముతో రాజభోగాలు అనుభవించారన్న ఆనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 08:31 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బుతో ఆ పార్టీ నేతలు విలాసవంతమైన జీవితం గడిపారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గొట్టిపాటి వెంకటేశ్ నాయుడు అనే వ్యక్తి స్కామ్ సొమ్ముతో హీరోయిన్లతో కలిసి ప్రత్యేక విమానాల్లో జల్సాలు చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులంతా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బంధువులు, సన్నిహితులేనని ఆరోపించారు. "రాజకాశిరెడ్డి ఎవరో తెలియదని, ఆయన వైఎస్ సుజాతారెడ్డికి అల్లుడు కాదని జగన్ చెప్పగలరారాజకాశిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువులు కాదా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించే ధైర్యం ఉందా" అని ఆనం సవాల్ విసిరారు. వైసీపీ నేతలను ఈ విషయంపై ప్రశ్నిస్తే, తమకు ఏమీ తెలియదని, స్కామే జరగలేదని చెప్పడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.ఈ మొత్తం లిక్కర్ స్కామ్‌కు సూత్రధారి, కింగ్‌పిన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డేనని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డే ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపించారని అన్నారు. "ఆ పొట్టోడిని నమ్మొద్దని, నమ్మితే సంకనాకిపోతారని నేను ముందే చెప్పాను" అంటూ తన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. ఇటీవల విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, "లిక్కర్ స్కామ్ జరిగింది కానీ, తనకు సంబంధం లేదు" అని చెప్పడాన్ని ఆనం ప్రస్తావించారు. పార్టీలో కీలక నేతగా, వైజాగ్‌ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన వ్యక్తి అలా చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి స్కామ్ జరిగిందని ఒప్పుకున్నారంటే, వైసీపీ ప్రభుత్వంలోని ప్రతి నాయకుడికీ అందులో భాగం ఉన్నట్లేనని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో తప్పు చేస్తే దండించడానికి చంద్రబాబు నాయుడు అనే హెడ్ మాస్టర్ బెత్తం పట్టుకుని ఉంటారని, అందుకే తాము తప్పులు చేయలేమని ఆనం అన్నారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం ప్రజల సొమ్ముతో రాజభోగాలు అనుభవించారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా వైసీపీ నేతలు ఇంకా అబద్ధాలు చెబుతున్నారని, మాట్లాడే ముందు ఒక్కసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ ఆరోపణలన్నింటికీ జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa