ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపుర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 02:25 PM

జమ్మూ కశ్మీర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్  జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో 10 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపుర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో ఈ విషాదం జరిగింది. కొండ ప్రాంతంలోని ఒక ప్రదేశానికి వెళ్తుండగా, మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై నుంచి జారి పక్కనే ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు దుర్మరణం పాలయ్యారని అధికారులు ధ్రువీకరించారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే ప్రమాద స్థలం నుంచి బయటకు తీశారు. గాయపడిన 10 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. ఉధంపుర్ డిప్యూటీ కమిషనర్ అభ్యర్థన మేరకు, తీవ్రంగా గాయపడిన వారిని తరలించేందుకు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దించారు.ఈ ఘటనపై స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ‘ఎక్స్’ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “బసంత్‌గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ వాహనం ప్రమాదానికి గురైన వార్త కలచివేసింది. డిప్యూటీ కమిషనర్ సలోని రాయ్‌తో మాట్లాడాను. ఆమె స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు తక్షణమే ప్రారంభమయ్యాయి. స్థానికులు కూడా స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు.జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి, రాంబన్, ఉధంపుర్ వంటి కొండ ప్రాంతపు జిల్లాల్లో ప్రమాదకరమైన రహదారులు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి కారణాలతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. ప్రాణాంతకమైన ప్రమాదాలను నివారించేందుకు ఈ జిల్లాల్లో ప్రత్యేక ట్రాఫిక్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa