రాఖీ పండగ వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా హిందూ మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమ, అనుబంధాలను కలగలిపేదే రక్షా బంధన్ . అక్క లేదా చెల్లెలు.. తమ సోదరులకు రాఖీ కట్టి.. వారి క్షేమాన్ని, విజయాన్ని కోరుకుంటుంది. ఇక ఆ సోదరులు కూడా తమ సోదరిని జీవితాంతం రక్షిస్తూ, అండగా ఉంటానని హామీ ఇస్తారు. అయితే చాలా మంది తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా.. సోదరభావంతో మెలిగే వారికి కూడా రక్షాబంధన్ రోజున రాఖీ కడతారు. ఇక రాజకీయ నాయకులకు పార్టీ నేతలు, కార్యకర్తలు రాఖీలు కట్టడం చూస్తూనే ఉంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏటా చాలా మంది మహిళలు, రాజకీయ నాయకులు, స్కూల్ పిల్లలు కూడా రాఖీలు కడుతూ ఉంటారు. కానీ ఒక మహిళ మాత్రం ప్రతి సంవత్సరం మోదీకి ప్రత్యేకంగా రాఖీ కడతారు. ఆమెనే పాకిస్థాన్లో జన్మించి, భారత్లో స్థిరపడిన ఖమర్ మొహ్సిన్ షేక్ . గత 30 ఏళ్లుగా ఆమె మోదీకి రాఖీ కడుతూనే ఉన్నారు.
శనివారం రాఖీ పండగ ఉన్న నేపథ్యంలో ఖమర్ మొహ్సిన్ షేక్.. ప్రధాని మోదీకి కట్టేందుకు ప్రత్యేకంగా రాఖీని తయారు చేశారు. అయితే గత 30 సంవత్సరాలుగా ఆమె మోదీకి రాఖీ కడుతూ.. తమ అన్నాచెల్లెళ్ల బంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది ఖమర్ మొహ్సిన్ షేక్.. స్వయంగా తన చేతులతో కొన్ని రాఖీలను తయారు చేసి.. చివరికి వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి మోదీ చేతికి కడతారు. ఈ సంవత్సరం 'ఓం' గుర్తుతో ఉన్న రాఖీని ఖమర్ ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఓం గుర్తు రాఖీ సంప్రదాయానికి, భక్తికి నిదర్శనమని మొహ్సిన్ తెలిపారు.
ఖమర్ మొహ్సిన్ షేక్ ఎవరు?
పాకిస్తాన్ కరాచీలో పుట్టిన ఖమర్ మొహ్సిన్ షేక్.. పెళ్లి చేసుకున్న తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. అయితే 30 ఏళ్ల క్రితం నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు నుంచే ఆయనకు మొహ్సిన్ షేక్ రాఖీ కట్టడం ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్తగా నరేంద్ర మోదీ ఉన్నప్పటి నుంచే ఆమె రాఖీ కట్టేవారు. ఆ సమయంలో ‘సోదరీ.. ఎలా ఉన్నారు?’ అని మోదీ మొహ్సిన్ను పలకరించడంతో తమ మధ్య అన్నాచెళ్లెళ్ల బంధం ప్రారంభం అయిందని ఆమె గుర్తుచేసుకున్నారు.
అయితే మొదట మోదీకి రాఖీ కట్టినప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు మొహ్సిన్ తెలిపారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు. తాను కోరిన ఆ కోరిక కూడా నెరవేరిందని అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రపంచాన్ని పాలించాలని కోరుకుంటున్నట్లు మొహ్సిన్ తన మనసులో మాట బయటపెట్టారు.
మన దేశం సాధిస్తున్న విజయాలకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి కారణమని ఆమె ప్రశంసలు గుప్పించారు. ఈ ఏడాది రక్షాబంధన్కు కూడా తాను మోదీకి స్వయంగా రాఖీ కట్టాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నానని ఖమర్ మొహ్సిన్ షేక్ తెలిపారు. 30 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతున్న మొహ్సిన్.. కరోనా మహమ్మారి సమయంలో మాత్రం కొవిడ్ ఆంక్షల కారణంగా కట్టలేకపోయినట్లు పేర్కొన్నారు. తాను ఒక ముస్లిం మహిళను అయినప్పటికీ.. స్వయంగా రాఖీలు రూపొందించి.. వాటిని మోదీకి కడతానని గర్వంగా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa