ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిరిజన అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు సమక్షంలో 21 సంస్థలతో ఒప్పందాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 09, 2025, 09:43 PM

ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరకు కాఫీకి మరింత బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడమే కాకుండా, ఆదివాసీల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు ఎంఓయూలు కుదుర్చుకుంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మొత్తం 21 ఒప్పందాలు జరిగాయి.వీటిలో అత్యంత కీలకమైనది, ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం టాటా కన్స్యూమర్స్ సంస్థతో గిరిజన సహకార సంస్థ  చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా ఆర్గానిక్ అరకు కాఫీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసే బాధ్యతను టాటా స్వీకరించనుంది. ఇది అరకు కాఫీ ఖ్యాతిని కొత్త శిఖరాలకు చేర్చగలదని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, కాఫీ సాగును ప్రోత్సహించేందుకు ఐటీసీ సంస్థ పాడేరు ఐటీడీఏతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే 4,010 హెక్టార్లలో కాఫీ సాగు చేస్తున్న ఐటీసీ, అదనంగా మరో 1,600 హెక్టార్లలో సాగును విస్తరించనుంది.గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించి, స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఓయో హోమ్స్, హోమీ హట్స్ ముందుకొచ్చాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధి, నిర్వహణ కోసం ఈ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. దీని ద్వారా పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు లభించడంతో పాటు గిరిజనులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.ఏపీ గిరిజనోత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసే లక్ష్యంతో అమెరికాకు చెందిన హాతీ సర్వీసెస్ ఎల్ఎల్‌సీ సంస్థతో జీసీసీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా అమెరికాలో జీసీసీ రిటైల్ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తుల విక్రయానికి ట్రైఫెడ్‌తో కలిసి జీసీసీ రిటైల్ షోరూమ్‌లను ఏర్పాటు చేయనుంది.ఇవే కాకుండా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో రబ్బరు సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర రబ్బరు బోర్డు, చింతపల్లిలో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సబ్ కో సంస్థ, పసుపు ప్రాసెసింగ్ కోసం ఎక్విప్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలన్నీ గిరిజనులకు జీవనోపాధి అవకాశాలు మెరుగుపరచడం, వారి ఉత్పత్తులకు సరైన ధర కల్పించడం, పర్యాటక రంగం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా జరిగాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa