ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 08:31 AM

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ కట్టించుకోవడానికి వెళ్తున్న కుమారుడు ప్రమాదంలో మరణించగా, ఆ వార్త విన్న షాక్‌తో తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు. ఒకే ఇంట్లో తండ్రీకొడుకులు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఇదే ప్రమాదంలో మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.తాళ్లపూడి మండలం పెద్దేవానికి చెందిన గుండేపల్లి వీరవెంకటమణి శంకరం (25) తన బాబాయి కుమార్తెతో రాఖీ కట్టించుకునేందుకు నిన్న సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై యాదవోలు బయలుదేరారు. అదే సమయంలో, గోపాలపురం మండలం వాదాలకుంటకు చెందిన మరపట్ల సువర్ణరాజు (52) బల్లిపాడులో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. గోపాలపురం మండలం చిట్యాల-వెంకటాయపాలెం మార్గంలో వీరిద్దరి వాహనాలు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో శంకరం అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన సువర్ణరాజును రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు శంకరం మరణించిన విషయం తెలియగానే తండ్రి శ్రీనివాసు (50) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు. శ్రీనివాసు ఆకుకూరలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. కొంతకాలం క్రితమే అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన, ఇప్పుడు కొడుకు మరణవార్త విని తట్టుకోలేక ప్రాణాలు విడిచారు.తండ్రికి చేదోడువాదోడుగా ఉండే శంకరం, ఆసరాగా ఉన్న భర్త శ్రీనివాసు ఇద్దరూ ఒకే రోజు దూరం కావడంతో తల్లి రుక్మిణి గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఒకే కుటుంబంలో జరిగిన ఈ రెండు మరణాలతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa