బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై శాశ్వత కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు.. నగర పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ఎలా? ఎలాంటి అవసరాలకు వినియోగించాలి? పర్యవేక్షణ తదితర అంశాలపై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇటీవల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో సీపీ రాజశేఖర్బాబుతో దుర్గగుడి అధికారులు దీనిపై చర్చించారు. అనంతరం లబ్బీపేటలోని పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆలయ అధికారులు పరిశీలించి.. నగరవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ కెమెరాల నుంచి వస్తున్న ఫీడ్ను యాక్సెస్ చేస్తున్న తీరును వారు అడిగి తెలుసుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో ఇదే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాన్ రూపొందించిన ఇవ్వాలని పోలీసులను ఆలయ అధికారులు కోరారు.
ప్రస్తుతం కనకదుర్గ ఆలయం , చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 300 వరకు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రికార్డిండులను ఈవో ఛాంబర్, ఈఈ గది, మరో ప్రాంతంలోని టీవీల్లో పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇటీవల గుడికి వచ్చిన ఓ కుటుంబం.. తమ వాహనాలు నగలు చోరీ అయినట్టు ఫిర్యాదు చేసింది. కానీ, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు ముందుకెళ్లలేదు. ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టేలా నిఘా కెమెరాలను పెంచి, పటిష్ట పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు.
ఇందుకోసం కంట్రోల్ కేంద్రాన్ని మహామండపంలోని నాలుగో అంతస్తులో ఏర్పాటుచేయనున్నారు. పెద్ద వీడియో వాల్తో సువిశాలంగా నిర్మించనున్న ఈ కేంద్రం నుంచే పర్యవేక్షణ చేపడతారు. క్యూలైన్లలో భక్తుల రద్దీ, ప్రసాదం పోటు, విక్రయ కౌంటర్లు, ఘాట్ రోడ్డు, తదితర ప్రదేశాల్లో ప్రత్యక్షంగా ఎల్ఈడీలపై వీక్షించే అవకాశం ఉంది. ఈ విజువల్స్ను పబ్లిక్ ఐపీ ద్వారా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్కి కూడా అనుసంధానం చేయనున్నారు. వీటి ఆధారంగా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని నియంత్రించి, వారికి సమాచారం అందజేయడానికి అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa