అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా గిరిజనుల జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల అమ్మకం, పర్యాటక రంగాన్ని పెద్దఎత్తు ప్రోత్సహించడం వంటి 21 అంశాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో కూటమి సర్కారు ఒప్పందాలు ఒప్పందం చేసుకుంది. వీటిలో ముఖ్యమైంది మన్యంలో పండే అరకు కాఫీ మార్కెటింగ్ కూడా ఉంది. రంపచోడవరం ప్రాంతంలో రబ్బరు సాగు ప్రోత్సాహం కోసం కేంద్రీయ రబ్బరు బోర్డు, ఐటీడీఏ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే, డ్వాక్రా సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల విక్రయాలు, అరకు కాఫీకి ప్రోత్సాహించేలా జీసీసీతో ఒప్పందం కుదిరింది.
మెప్మా ద్వారా అరకు కాఫీ కియోస్క్ల ఏర్పాటుకు ఓ ఒప్పందం, జీసీసీ ఉత్పత్తులను విదేశాల్లో విక్రయించేందుకు హాతీ సర్వీసెస్ ఎల్ఎల్సీ సంస్థ, జీసీసీ మధ్య ఇంకో ఒప్పందం జరిగింది. అలాగే, దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తుల అమ్మకం కోసం సంయుక్తంగా రీటైల్ షోరూమ్ల ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ట్రైఫెడ్ ఏపీ, జీసీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ బ్రాండింగ్, మార్కెట్ కోసం దిగ్గజ సంస్థ టాటా జీసీసీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అరకు కాఫీ ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు అందుకుంది. చింతపల్లి ప్రాంతంలో రెడ్చెర్రీ రైఫైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి సబ్కో సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది.
విశాఖ మన్యంలో కాఫీ తోటల విస్తరణకు సంబంధించి ఐటీసీ.. ఐటీడీఏ పాడేరుతో ఒప్పందం చేసుకుంది. గిరిజన మహిళల ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయం కోసం ఫ్రాంటియర్ మార్కెటింగ్, ఈజీమార్ట్లు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాయి. పసుపు మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఎక్విన్,ఐటీడీఏ మధ్య ఎంఓయూ కుదిరినట్టు అధికారులు తెలిపారు. గిరిజన మహిళా సంఘాల ద్వారా అటవీ ఉత్పత్తులు అమ్మకానికి అవగాహన కల్పించేందుకు ఐఎస్బీ కంపెనీ మరో ఒప్పందం చేసుకుంది.
అరకు కాఫీ
అటవీ ప్రాంతాల్లో హోంస్టేల కోసం ఓయో, హూమీ హట్స్ సంస్థలు అంగీకరించాయి. గిరిజన యువతలో నైతిక విలువల పెంపు కోసం మార్పు సొసైటీ, గిరిజన పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ టూరిజం ఫోరం ముందుకొచ్చాయి. అరకు కాఫీని ప్రస్తుతం పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లోని 2.58 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పార్లమెంట్లోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కాఫీని అంతర్జాతీయ విపణికి తీసుకెళ్లేలా ప్రైవేటు సంస్థలతో కలిసి జీసీసీ అవగాహన ఒప్పందం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గిరిపుత్రుల ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa