ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ-వాషింగ్టన్ డీసీ డైరెక్ట్ ఫ్లైట్ సేవలు నిలిపివేత

national |  Suryaa Desk  | Published : Mon, Aug 11, 2025, 07:13 PM

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి నేరుగా నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయం 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. నిర్వహణాపరమైన కారణాలతోనే ఈ చర్యలు చేపడుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఎయిర్ ఇండియా తన ఫ్లీట్‌లోని 26 బోయింగ్ 787-8 విమానాలకు రెట్రోఫిటింగ్ ఆధునికీకరణ పనులను గత నెలలో ప్రారంభించింది. ఈ ఆధునికీకరణ ప్రక్రియ 2026 చివరి వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పలు విమానాలు సేవలకు అందుబాటులో ఉండవు. దీనివల్ల ఏర్పడే విమానాల కొరత, అలాగే పాకిస్థాన్ గగనతలం ఇంకా మూసివేసి ఉండటంతో సుదూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా వివరించింది. ఇతర సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకే ఈ మార్గంలో సేవలను నిలిపివేస్తున్నామని తెలిపింది.ఇప్పటికే సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డీసీకి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులను సంప్రదించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణికుల ఇష్టప్రకారం ఇతర విమానాల్లో సీట్లు కేటాయించడం లేదా టికెట్ డబ్బును పూర్తిగా వాపసు చేయడం వంటి ఆప్షన్లు అందిస్తామని పేర్కొంది.అయితే, ఈ డైరెక్ట్ ఫ్లైట్ రద్దయినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. తమ భాగస్వామ్య విమానయాన సంస్థలైన అలస్కా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ ద్వారా న్యూయార్క్ , నెవార్క్  చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా వాషింగ్టన్ డీసీకి వన్-స్టాప్ విమాన సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఉత్తర అమెరికాలోని టొరంటో, వాంకోవర్‌తో సహా మరో ఆరు నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa