ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు ప్రాణహాని ఉంది, రక్షించండి.. పూణే కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

national |  Suryaa Desk  | Published : Wed, Aug 13, 2025, 09:22 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు తెరతీశారు. పూణేలోని స్పెషల్ కోర్టుకు హాజరైన సందర్భంగా.. తనకు ప్రాణహాని ఉందని వెల్లడించారు. తన ప్రాణాలకు హాని ఉందని.. రక్షించాలని కోర్టును తెలిపారు. గతంలో తాను వీర్ సావర్కర్‌పై చేసిన ప్రకటన సందర్భంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపై ఇద్దరు నేతలు బెదిరించినట్లు వివరించారు. తాజాగా పూణే ప్రత్యేక కోర్టుకు హాజరైన సమయంలో తనకు మరింత భద్రత కల్పించాలని కోరారు.


విదేశాల్లో పర్యటించిన సమయంలో రాహుల్ గాంధీ వీర్ సావర్కర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై సత్యకి సావర్కర్ అనే వ్యక్తి పూణేలోని ప్రత్యేక కోర్టులో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు కాగా.. విచారణ జరుగుతోంది. వీర్ సావర్కర్‌ పరువు నష్టం కలిగించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో పూణే స్పెషల్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఈ కేసులో ఫిర్యాదు చేసిన సత్యకి సావర్కర్‌.. నాథూరామ్ గాడ్సే, గోపాల్ గాడ్సే వారసుడు అని.. వారి చరిత్ర హింసతో కూడి ఉందని పేర్కొన్నారు.


దీనికి సంబంధించి.. రాహుల్ గాంధీ తరఫు లాయర్ మిలింద్ దత్తాత్రయ పవార్ పూణే ప్రత్యేక కోర్టుకు లిఖితపూర్వక దరఖాస్తును అందించారు. ఫిర్యాదుదారుడు సత్యకి సావర్కర్ కుటుంబ చరిత్రను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంతోపాటు.. కొంతమంది నాయకుల వివాదాస్పద ప్రకటనలతో రాహుల్ గాంధీ ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని.. ఆయన లాయర్ కోర్టుకు విన్నవించారు.


ఇక రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌లో రవ్‌నీత్ సింగ్ బిట్టు అనే వ్యక్తి పేరును ప్రస్తావించారు. దేశంలోనే నంబర్ వన్ ఉగ్రవాది రాహుల్‌ గాంధీ అని.. రవ్‌నీత్ సింగ్ బిట్టు పేర్కొన్నట్లు ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే పిటిషన్‌లో బీజేపీ నేత తర్విందర్ సింగ్ మార్వా పేరును కూడా చేర్చారు. రాహుల్ గాంధీ పరిస్థితి కూడా ఆయన నానమ్మ ఇందిరాగాంధీ పరిస్థితిలా ఉంటుందని తర్విందర్ సింగ్ హెచ్చరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసు విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యే సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa