ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఈ నెలాఖరు కల్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 07:50 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు వినిపించారు. ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నెలాఖరు నాటికి డీఎస్సీ నియామకాలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మెగా డీఎస్సీ ద్వారా సుమారుగా 16 వేలకుపైగా ఉపాధ్యాయుల భర్తీని చేపడుతున్నారు. ఈ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలను జూన్ నుంచి జూలై వరకు నిర్వహించగా.. డీఎస్సీ ఫలితాలను ఇటీవల ప్రకటించారు. మిగతా ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్ట్ నెలాఖరు నాటికి డీఎస్సీ నియామకాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.


2014-19 మధ్యకాలంలో దేశంలోనే టాప్ త్రీ రాష్ట్రాలలో ఏపీని నిలిపామన్న చంద్రబాబు.. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఏపీ బ్రాండ్‌ను నాశనం చేశారన్న చంద్రబాబు.. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం పాలనతో పోలవరం , అమరావతి నిలిచిపోయాయని.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు 94 శాతం స్ట్రైక్‌ రేట్‌, 57 శాతం ఓట్‌ షేర్‌తో ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పగించారన్న చంద్రబాబు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తు్న్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింద రాష్ట్రంలోని 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తు్న్నామని వివరించారు. విద్యార్థులను బడికి పంపే తల్లులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్న చంద్రబాబు.. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్నామని వివరించారు.


దీపం -2 పథకం కింద మహిళలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని.. నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చంద్రబాబు వివరించారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగా మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేశామన్న చంద్రబాబు.. ఈ నెలాఖరు కల్లా నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, నాయీ బ్రాహ్మణుల కనీస వేతనం రూ.25 వేలకు పెంపు.. 4000 సెలూన్లకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, కల్లుగీత కార్మికులకు పది శాతం లిక్కర్ షాపులు, బార్లు, మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం , చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ . పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం నారా చంద్రబాబు నాయుడు వివరించారు.


ప్రజలకు వేగంగా, పారదర్శకంగా పాలన అందించాలనే ఉద్దేశంతో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చినట్లు చంద్రబాబు వివరించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 పౌరసేవలు అందిస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa