మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒక మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ప్రముఖ నటి శ్వేతా మేనన్ ఈ అరుదైన ఘనతను సాధించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. 31 ఏళ్ల ‘అమ్మ’ ప్రస్థానంలో ఒక నటి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇదే ప్రథమం.కొచ్చిలో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థి, నటుడు దేవన్పై విజయం సాధించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఓటింగ్లో, మొత్తం 506 మంది సభ్యులకు గాను 298 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం వెల్లడించిన ఫలితాల్లో శ్వేతా మేనన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీ ప్రియ, జనరల్ సెక్రటరీగా అన్సిబా హాసన్, జాయింట్ సెక్రటరీగా కుక్కు పరమేశ్వరన్ ఎన్నికయ్యారు.వాస్తవానికి ఈ ఎన్నికలు 2027లో జరగాల్సి ఉంది. అయితే, గత ఏడాది నటీమణులపై లైంగిక ఆరోపణల వివాదాల నేపథ్యంలో, నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి అధ్యక్షుడు మోహన్లాల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ‘అమ్మ’ సంస్థకు ముందుగానే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. గతంలో ఎం.జి. సోమన్, మధు, మోహన్లాల్ వంటి ప్రముఖులు ఈ సంస్థకు అధ్యక్షులుగా వ్యవహరించారు.1994లో ‘ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్’గా నిలిచిన శ్వేతా మేనన్, ‘అనస్వరం’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మలయాళంతో పాటు హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. తెలుగు ప్రేక్షకులకు ఆమె ‘ఆనందం’ సినిమాలో ప్రత్యేక గీతంలో, ‘జూనియర్స్’, నాగార్జున నటించిన ‘రాజన్న’ వంటి చిత్రాల ద్వారా సుపరిచితురాలే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa