ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భక్తుడి వాహనం స్కానింగ్.. విజిలెన్స్ సిబ్బంది షాక్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 05:38 PM

తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. కొంతమంది ఆర్టీసీ బస్సులు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో తిరుమలకు చేరుకుంటే.. మరికొందరు సొంత వాహనాలతో తిరుమలకు వస్తుంటారు. ఇంకొంతమంది అలిపిరి, శ్రీవారిమెట్టు వంటి నడక మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే కార్లు, బైకులు, బస్సులలో తిరుమలకు వచ్చేవారిని అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేయడం జరుగుతుంది. తిరుమల కొండపైన మద్యం, మాంసం, ప్లాస్టిక్, బీడీలు, గుట్కా వంటి పదార్థాలు పూర్తిగా నిషిద్ధం. అలాంటి నిషేధిత వస్తువులను కొండపైకి రానివ్వకుండా.. అలాగే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అలిపిరి చెక్ పోస్టు వద్ద సిబ్బంది అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. స్కానింగ్ యంత్రాల ద్వారా వాహనాలు, బ్యాగులను తనిఖీ చేస్తుంటారు. ఈ క్రమంలోనే శనివారం ఆసక్తికర ఘటన జరిగింది.


కర్ణాటకకు చెందిన ఓ భక్తుడి వాహనం నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తాబేలును స్వాధీనం చేసుకున్నారు. గుల్బర్గాకు చెందిన ధనరాజ్ షిండే అనే భక్తుడు కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ క్రమంలోనే అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద విజిలెన్స్ సిబ్బంది వారి వాహనాన్ని స్కానింగ్ చేశారు. ఈ సమయంలో వాహనంలో తాబేలు కనిపించడంతో అవాక్కయ్యారు. విషయమేమిటని ధనరాజ్‌ను ఆరా తీస్తే.. శ్రీశైలం నుంచి వచ్చే సమయంలో తమకు రోడ్డు మీద తాబేలు కనిపించిందని.. దానిని సంచిలో వేసుకుని వచ్చినట్లు ధనరాజ్ చెప్పుకొచ్చారు. దీంతో ధనరాజ్ వద్ద నుంచి విజిలెన్స్ అధికారులు తాబేలును స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.


తిరుచానూరులో పవిత్రోత్సవాలు..


తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 2వ తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగనుంది.సెప్టెంబరు 5వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 6న పవిత్ర సమర్పణ కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబరు 7న పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల్లో పాల్గొనాలకునే భక్తులు. రూ.750/- చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందిస్తారు.


మరోవైపు తిరుచానూరు పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 2న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మరోవైపు పవిత్రోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 4,5,6,7వ తేదీలలో ఆలయంలో పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa