ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ విద్యాబోధనతో పాటుగా ఆర్థిక సాయం.. వారి కోసం ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 17, 2025, 08:31 PM

దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతూ ఉంటాయి. వారి సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కోసం ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వారికి చదువు నేర్పడంతో పాటు భవిష్యత్తుకు బాటలు వేసేలా కీలక చర్యలు తీసుకుంటోంది. విభిన్న ప్రతిభావంతులను సాధారణ పాఠశాలల్లో చేర్పించడంతో పాటుగా.. వారికి ట్యాబ్‌ల ద్వారా బోధన అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో 33 రకాల యాప్‌ల సాయంతో డిజిటల్ విద్యా బోధన చేస్తోంది. అలాగే ఆటిజంతో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలో తొలిసారిగా ఏపీలోని పట్టణాల్లో 125 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.


మరోవైపు విభిన్న ప్రతిభావంతులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. సర్వేలో గుర్తించిన అనంతరం వారిని సమీపంలోని గవర్నమెంట్ స్కూళ్లల్లో నమోదు చేస్తున్నారు. అలాగే ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీలను భవిత కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న ఉపాధ్యాయులతో వారికి విద్యాబోధన చేయిస్తున్నారు. ఇక స్కూలుకు కూడా రాలేని చిన్నారుల కోసం ప్రతి శనివారం ఇంటి వద్దనే బోధన చేస్తున్నారు. అలాగే దివ్యాంగులైన విద్యార్థులకు రవాణా భత్యం కింద నెలకు రూ.600 అందిస్తోంది ప్రభుత్వం. బాలికలైతే మరో 200 రూపాయలు అదనంగా రవాణా భత్యం చెల్లిస్తున్నారు. సొంతంగా స్కూలుకు రాలేని దివ్యాంగ విద్యార్థులు సహాయకులను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు సహాయకుల భత్యం కూడా అందిస్తున్నారు. అలాంటి వారికి నెలకు రూ.600 చొప్పున చెల్లిస్తున్నారు.


మరోవైపు విభిన్న ప్రతిభావంతులు , ప్రత్యేక అవసరాలు గల పిల్లల చదువును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు చెప్తున్నారు. పాఠశాలల్లో వీరి ప్రవేశాలు పెంచేందుకు, ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. సాధారణ పిల్లలతో పోల్చితే వీరు ఎందులోనూ తీసిపోరంటున్న అధికారులు.. ఆ నమ్మకం వారిలో కలిగించి, వారి సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa