అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వేడి మరోసారి తారస్థాయికి చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పట్టణంలోకి అడుగుపెట్టనివ్వబోమని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చిచెప్పారు. "కేతిరెడ్డీ దమ్ముంటే తాడిపత్రికి రా తేల్చుకుందాం" అంటూ బహిరంగ సవాల్ విసిరారు. హైకోర్టు ఆదేశాలతో ఈరోజు పెద్దారెడ్డి తాడిపత్రికి రానున్న నేపథ్యంలో, ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదరడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకురావాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. గతంలో తనను పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నారంటూ పెద్దారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, కోర్టు ఆదేశాలు ఎన్ని ఉన్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. "ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి, ఆయన అనుచరులు చేసిన దౌర్జన్యాలకు, అక్రమాలకు ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టాలు, న్యాయాలు మీకు ఒకలా, మాకు ఒకలా వర్తిస్తాయా అని ఆయన ప్రశ్నించారు. తనకు వ్యక్తిగతంగా పెద్దారెడ్డిపై కక్ష లేదని, కానీ ఆయన చేసిన పనులను మాత్రం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ముందు తాడిపత్రికి రావడం కాదు, అక్రమంగా నిర్మించిన తన ఇంటి సంగతి చూసుకోవాలని పెద్దారెడ్డికి హితవు పలికారు.మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తాడిపత్రిలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునివ్వడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa