ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించే దిశగా జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. రష్యాపై ఉమ్మడిగా ఒత్తిడి పెంచి, శాశ్వత శాంతిని సాధించే లక్ష్యంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ సోమవారం వాషింగ్టన్లో అడుగుపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు పలు యూరోపియన్ అగ్రనేతలతో ఆయన జరపనున్న ఉన్నత స్థాయి సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.ఈ పర్యటన గురించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. "నేను ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నాను. రేపు ట్రంప్తో, యూరోపియన్ నేతలతో సమావేశమవుతాను. ఈ యుద్ధాన్ని వేగంగా, నమ్మకంగా ముగించాలనే బలమైన కోరిక మా అందరిలో ఉంది. అయితే, ఈ శాంతి శాశ్వతంగా ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు. గతంలో క్రిమియా, డాన్బాస్లను వదులుకోవాల్సి వచ్చినట్లుగానో, 1994లో విఫలమైన భద్రతా హామీల వంటిదిగానో ఈ శాంతి ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.అయితే, ఈ సమావేశంపై యూరోపియన్ దేశాల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్లకు అనుగుణంగా కొన్ని రాయితీలు ఇచ్చేలా జెలెన్స్కీపై ట్రంప్ ఒత్తిడి తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. క్రిమియాపై హక్కులను వదులుకోవడం, నాటోలో చేరబోమని హామీ ఇవ్వడం వంటి షరతులకు ఉక్రెయిన్ను అంగీకరింపజేసే ప్రయత్నం జరగవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వంటి అగ్రనేతలు జెలెన్స్కీతో పాటు వాషింగ్టన్ చేరుకున్నారు.ఈ భేటీ ద్వారా అమెరికా వైఖరిని స్పష్టంగా తెలుసుకోవాలని, ఉక్రెయిన్కు నమ్మకమైన భద్రతా హామీలు లభించేలా చూడాలని యూరప్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. "మనం ఇప్పుడు రష్యా ముందు బలహీనంగా కనిపిస్తే, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు పునాది వేసినట్లే అవుతుంది" అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక భద్రతా హామీలు, సైనిక, ఆర్థిక సహాయం కొనసాగింపు, రష్యాపై ఆంక్షల ఒత్తిడి వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉంటాయని జర్మనీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, దొనెట్స్క్, సుమీ ప్రాంతాల్లో తమ సైనికులు విజయాలు సాధిస్తున్నారని జెలెన్స్కీ గుర్తుచేశారు. ఈ యుద్ధంలో తమకు మద్దతిస్తున్న అమెరికా, మిత్రదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa