సాధారణంగా ద్రవ్యోల్బణం వల్ల గానీ, సరఫరా గొలుసులో ఇబ్బందులు తలెత్తినప్పుడు గానీ ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు అమెరికాలోని మన ఎన్నారైలకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. అక్కడ కొన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో రాత్రికి రాత్రే ధరలు ఆకాశాన్ని తాకాయి. అదీ కూడా కొత్త టారిఫ్లు (సుంకాలు) ఇంకా అమలులోకి రాకముందే ఈ పరిస్థితి వారికి ఎదురయ్యింది. ఇటీవల భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్పై సుంకాలు విధించారు.
పెరుగుదలకు అసలు కారణం
అమెరికాలోని ఎన్నారైలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వస్తువుల ధరలు రాత్రికి రాత్రే 11.99 డాలర్లు నుంచి 13.99 డాలర్లకు పెరిగాయట. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే, రూపాయిలో 10, 20 పైసలు పెరుగుతుంది. మహా అయితే ఒక రూపాయి పెరుగుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు ధరల పెరుగుదల మాత్రం మామూలుగా లేదు 11.99 నుంచి 13.99 అంటే దాదాపు 2 డాలర్లు పెరిగినట్టే.
ప్రస్తుతం ఒక అమెరికా డాలర్కు రూపాయి మారకపు విలువ దాదాపు రూ.88. ఈ లెక్కన, 11.99 డాలర్లు అంటే సుమారు రూ.1,055 అవుతుంది. ఇప్పుడు పెరిగిన ధర 13.99 డాలర్లు అంటే, అది దాదాపు రూ.1,231 అవుతుంది. అంటే, ఒక్క వస్తువుపై దాదాపు రూ.176 పెరిగింది. ఒకే వస్తువు మీద అంత ధర పెరిగితే, ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, మాంసం వంటివన్నీ కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. సాధారణంగానే అమెరికాలో జీవన ప్రమాణ వ్యయం ఎక్కువ. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల వల్ల అక్కడ ఉండే భారతీయుల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. కానీ, కొత్త టారిఫ్లు రాకముందే కొనుగోలు చేసిన పాత స్టాక్పై ధరలు పెంచడం చూసి చాలామంది కస్టమర్లు కోపంతో ఊగిపోతున్నారు. దీన్ని చాలామంది దుకాణదారుల ఆశగా, అవకాశవాద ధోరణిగా చూస్తున్నారు.
ఖర్చులు పెరిగితే ధరలు పెంపు?
కొందరు దుకాణదారులు మాత్రం తమ చర్యలను సమర్ధించుకుంటున్నారు. ఇంధనం, బంగారం లాంటి వాటి ధరలు ఎలాగైతే భవిష్యత్తులో పెరిగే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే పెంచుతారో, తాము కూడా అదే విధంగా చేస్తున్నామని వాదిస్తున్నారు. కొత్తగా స్టాక్ తెచ్చుకోవాలంటే టారిఫ్ల వల్ల ఖర్చు పెరుగుతుంది కాబట్టి ముందుగానే ఆ భారాన్ని సర్దుబాటు చేసుకోవాలని చెబుతుండటం గమనార్హం. అంతేకాదు, పాత స్టాక్ను తక్కువ ధరలో అమ్మితే మళ్లీ సరుకు తెచ్చుకునేప్పుడు నష్టపోతామని కూడా అంటున్నారు.
కస్టమర్ల ఆలోచన ఏంటి?
దుకాణదారుల వాదన ఎలా ఉన్నా, కస్టమర్ల మనసులో మాత్రం తమకు అన్యాయం జరిగింది అనే భావన బలంగా ఉంది. ధరలు పెరగడం వారికి పెద్ద సమస్య కాదు, కానీ మార్కెట్ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని, లేనిపోని కారణాలు చెప్పి ధరలు పెంచుతున్నారని వాళ్లు అనుకుంటున్నారు. నిజంగా 'సుంకాలు వచ్చాయా లేదా అనేది కాదు, వారిని మోసం చేస్తున్నారనే భావనే ఎక్కువ బాధ పెడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa