ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 08:01 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. తిరుమలలో ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. అయితే విశేష పర్వదినాలు, ఉత్సవాలు, పండుగల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటోంది. దీంతో ఇలాంటి రోజులలో శ్రీవారి దర్శనానికి గంటలు గంటలు సమయం పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ సరికొత్త ఆలోచన చేస్తోంది. దేవదేవుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గంట నుంచి రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.


తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో బుధవారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఏఐ సాయంతో భక్తులు గంట నుంచి రెండు గంటల్లోగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అలాగే తిరుమలలో త్వరలోనే కొత్త క్యాంటీన్లను ప్రారంభిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీలో పనిచేసే అన్యమత సిబ్బందిని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాంటి వారిని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద పంపించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సిబ్బంది ఎవరైనా అన్యమత ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


మరోవైపు తిరుమలలో శ్రీవాణి టికెట్ల దర్శన సమయాలు మారుస్తామన్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఉదయం శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు సాయంత్రానికల్లా శ్రీవారిని దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. దళారులు, సైబర్ మోసాల కారణంగా తిరుమలకు వచ్చే కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇలాంటి వాటిని అరికట్టేందుకు తిరుమలలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తిరుమలలో వీఐపీ దర్శనాలను ఉదయం 8 నుంచి 8.30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa