ఏపీలో హాట్టాపిక్గా మారిన రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను బాపట్ల జిల్లా అద్దంకి దగ్గరలో అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్స్టేషన్కు తరలించారు. కోవూరులో ఒక ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరుణను కోర్టులో హాజరుపరచనున్నారు.. ఆమె నాలుగు రోజుల క్రితం కూడా ఒక సీఐకి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహాయంతో అరుణ చాలా నేరాలు, సెటిల్మెంట్లు చేసింది అని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి.. పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె మంగళవారం రోజు ఓ పోస్ట్ పెట్టారు.. 'ఒక వైపు చంపుతారు అనే వార్తలు వస్తున్నాయి ఇంకో వైపు అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి ఇంక ఎవ్వరు నాకు కాల్స్ చేయద్దు నేను ఇంక ఏ మీడియా ముందుకు రాలేను నా ఫోన్ ఆఫ్ చేస్తున్నాను తప్పు చెయ్యకపోయినా శిక్షలు వెయ్యాలని చూస్తున్న సమాజం లో నేను ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను. నేను tdp కాదు ycp కాదు social media వాళ్ళు కొట్టుకోవడం ఆపండి' అన్నారు.
నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్కు ఇచ్చిన పెరోల్ను రద్దు చేశామన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పెరోల్ ఇచ్చిన వారంలోనే అతన్ని తిరిగి జైలుకు పంపారని.. క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పెరోల్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుగుతోందన్నారు. పెరోల్ ఇవ్వడానికి ఎవరు సహకరించారు, దీని వెనుక ఎవరున్నారనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. జైళ్ల శాఖపై సమీక్ష సందర్భంగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై కూడా విచారణ జరుగుతోందన్నారు.
హోంమంత్రి అనిత శ్రీకాంత్ ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు ఉంటాయని హోంమంత్రి తెలిపారు. అరుణ నేపథ్యంపై కూడా విచారణ జరుగుతోందని.. ఆమె నాలుగు రోజుల క్రితం హోంమంత్రి పేషీ నుంచి అని చెపపి ఒక సీఐకి ఫోన్ చేసి బెదిరించిన విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో ఆమెపై రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. పెరోల్ ఎలా వచ్చిందో నివేదిక వచ్చాక తెలుస్తుందని, గత ప్రభుత్వంలో అసాంఘిక శక్తులను పెంచి పోషించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో వాటి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.
ఒక మహిళ తన భర్త జైలులో ఉన్నాడని, పెరోల్ కోసం సిఫారసు లేఖ ఇవ్వమని అడిగినా ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మంగళవారం తనపై ఓ పత్రికలో వార్త వచ్చిందని.. అందుకు తాను క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక సంస్థ ఛైర్మన్ సిఫారసుతో ఆ మహిళ తన దగ్గరకు వచ్చిందని సోమిరెడ్డి చెప్పారు. ఆమె శాలువా కప్పి, తన భర్త పెరోల్ కోసం సిఫారసు చేయమని కోరిందన్నారు. అయితే తాను వేరే నియోజకవర్గం విషయాల్లో కల్పించుకోనని ఆమెకు తేల్చి చెప్పానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa