భారత క్రికెట్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల పేర్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వన్డే ర్యాంకింగ్స్ నుంచి అకస్మాత్తుగా మాయమవడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టాప్-10లోనే కాదు, కనీసం టాప్-100లో కూడా వీరిద్దరి పేర్లు కనిపించకపోవడంతో అభిమానులు షాక్కు గురయ్యారు. దీంతో వీరిద్దరూ వన్డే ఫార్మాట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ (38), కోహ్లీ (36) ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారి పేర్లు ర్యాంకింగ్స్ నుంచి తొలగించడంతో అభిమానుల ఆందోళన మరింత పెరిగింది. "కోహ్లీ, రోహిత్ లేకుండా వన్డే ర్యాంకింగ్స్ ఏంటి రిటైర్మెంట్ ప్రకటన రాబోతోందా"ఈ వార్త వినడానికి మా మనసు సిద్ధంగా లేదు" అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రెండో స్థానంలో రోహిత్, నాలుగో స్థానంలో కోహ్లీ ఉండగా, ఒక్కసారిగా వారి పేర్లు కనిపించకపోవడం ఈ గందరగోళానికి దారితీసింది.అయితే, అభిమానుల ఊహాగానాలకు తెరదించుతూ ఐసీసీ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ఇది కేవలం ఒక సాంకేతిక లోపం వల్లే జరిగిందని వెల్లడించింది. "ఈ వారం ర్యాంకింగ్స్లో కొన్ని సమస్యలు తలెత్తాయి, వాటిని సరిచేస్తున్నాం" అని ఐసీసీ ప్రతినిధి తెలిపారు. చెప్పినట్టుగానే, కొద్ది గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ర్యాంకులను వారి పాత స్థానాల్లో పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.ఇటీవలే ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయంలో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డులు కలిగిన కోహ్లీ, రోహిత్.. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్తో పాటు భవిష్యత్ టోర్నీలలోనూ ఆడనున్నారు. ఈ సాంకేతిక లోపం తాత్కాలిక కలకలం సృష్టించినప్పటికీ, వారి రిటైర్మెంట్పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa